దుబాయ్: మరికొన్ని రోజుల్లో వరల్డ్కప్( T20 World Cup ) ప్రారంభం కానున్న సమయంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన ముగ్గురు ప్లేయర్స్ను ఐపీఎల్ తర్వాత కూడా యూఏఈలోనే బయో బబుల్లో ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, ఢిల్లీ పేస్ బౌలర్ అవేష్ ఖాన్, కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్లను యూఏఈలోనే ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 7న రాజస్థాన్ చివరి మ్యాచ్ ఆడేసినా.. శాంసన్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్లలో 40 సగటుతో 484 పరుగులు చేశాడు.
శాంసన్తోపాటు ఢిల్లీ బౌలర్ అవేష్ ఖాన్ను కూడా టీమ్తోపాటే ఉండాల్సిందిగా బోర్డు చెప్పినట్లు సెలక్షన్ కమిటీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతను నెట్ బౌలర్గా ఉండనున్నాడు. ఒకవేళ అవసరమైతే ప్రధాన టీమ్తోనూ అవేష్ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్లో 23 వికెట్లతో హర్షల్ పటేల్ (32) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవేష్ నిలిచాడు. మరోవైపు ఆశ్చర్యకరంగా ఈ సీజన్లోనే కోల్కతా టీమ్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి అదరగొడుతున్న ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్కు కూడా యూఏఈలోనే ఉండాల్సిందిగా ఆదేశాలు అందాయి.
ఈ డాషింగ్ ఓపెనర్ ఈ సీజన్లో 8 మ్యాచ్లలో 37 సగటుతో 265 రన్స్ చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్లో 3 వికెట్లు తీశాడు. ఇప్పటికే బీసీసీఐ సన్రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ను కూడా టీమ్తోనే ఉండాలని చెప్పింది. అతడు ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతి (గంటకు 152.95 కిలోమీటర్లు) విసిరిన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.