Team India : భారత జట్టు వచ్చే ఏడాది స్వదేశంలో వరుసగా మూడు దేశాలతో వన్డే, టీ 20తో పాటు టెస్టు సిరీస్లు ఆడనుంది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు భారత పర్యటనకు రానున్నాయి. ఈ జట్ల పర్యటన, మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉన్నందున ఈ మూడు జట్ల సిరీస్ భారత జట్టుకు ప్రాక్టీస్గా ఎంతగానో ఉపయోగపడనుంది. అంతేకాదు వన్డే ప్రపంచకప్ జట్టుని ఎంపిక చేసేందుకు స్వదేశంలో జరిగే ఈ సిరీస్లు మంచి అవకాశం.
ఇండియా టూర్లో శ్రీలంక జట్టు టీ 20, వన్డే సిరీస్ ఆడనుంది. మూడు టీ20ల సిరీస్లో మొదటి టీ 20 జనవరి 3వ తేదీన ముంబైలో మొదలుకానుంది. రెండో టీ 20 జనవరి 5వ తేదీన పూనేలో, మూడో టీ20 జనవరి 7న రాజ్కోట్లో జరగనున్నాయి. మొదటి వన్డే జనవరి 10వ తేదీన గువహతిలో, రెండో వన్డే జనవరి 12- కోల్కతాలో, మూడో వన్డే జనవరి 15న త్రివేండ్రంలో జరుగుతుంది.
భారత పర్యటనలో న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్, మూడు టీ20 సిరీస్లు ఆడనుంది. మొదటి వన్డే జనవరి 18న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. రాయ్పూర్లో జనవరి 21వ తేదీన రెండో వన్డే జరగనుంది. రాయ్పూర్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. మూడో వన్డే ఇండోర్లో జనవరి 24న జరగనుంది. మూడు టీ 20 సిరీస్లో మొదటి మ్యాచ్ జనవరి 27 న రాంచీలో, రెండో టీ 20 లక్నోలో, మూడో టీ 20 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్లో జరుగుతాయి.
ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. మొదటి టెస్ట్ ఫిబ్రవరి 9వ తేదీన నాగ్పూర్లో మొదలవుతుంది. ఫిబ్రవరి 17న ఢిల్లీలో రెండో టెస్ట్, మార్చి 1న ధర్మశాలలో మూడో టెస్ట్, మార్చి 9 న అహ్మదాబాద్లో చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఐదేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్, భారత టూర్కు వస్తోంది. 2007లో స్టీవ్స్మిత్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియాను టీమిండియా 2-1తో ఓడించి సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ టెస్ట్ సిరీస్కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇరు జట్ల మధ్య జరగనున్న చివరి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇదే కావడం గమనార్ఢం. ఈ టెస్ట్ సిరీస్ రెండు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే.. 2023లో లార్డ్స్ మైదానంలో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే భారత్ ఈ టెస్ట్ సిరీస్లో తప్పనిసరిగా గెలవాలి.