హైదరాబాద్, జనవరి 29 : బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం త్వరలో కార్యరూపం దాల్చబోతున్నది. వీటి కోసం కేటాయించిన స్థలాల పత్రాలను ఫిబ్రవరి 2న ఆయా సంఘాలకు అందజేయనున్నారు. ఒకే సంఘంగా రిజిస్టరైన 10 బీసీ సంఘాలకు వీటిని అందజేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని బీసీ కులాలకు ఆత్మగౌర వభవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో 82 ఎకరాలను సేకరించింది. దాదాపు రూ.5 వేల కోట్ల విలువ చేసే ఈ భూములను 41 బీసీ కులాలకు కేటాయించి, ఒక్కో భవన నిర్మాణానికి రూ.కోటి చొప్పున మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి గత నెలలో బీసీ కుల సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆత్మగౌరవ భవనాల కోసం బీసీ సంఘాలన్నీ ఏకమై రిజిస్టర్డ్ ట్రస్ట్గా ఏర్పడాల్సి ఉంటుందని సూచించారు. ఏక సంఘంగా ఏర్పడిన బీసీ కులాలకే ఆత్మగౌరవభవనాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు. తదనుగుణంగా బీసీ జాబితాలోని ఎల్లాపి, మేదరి, పెరిక, నకాస్, బసవేశ్వర లింగాయత్, రంగ్రేజ్ భవసార, అగర్వాల్ సమాజ్, నీలి, జాండ్ర, తెలంగాణ మరాఠా మండల్లోని కులాలన్నీ ఏక సంఘంగా ఏర్పడ్డాయి. దీంతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ఈ 10 సంఘాలకు కేటాయించిన స్థలాల పత్రాలను ఫిబ్రవరి 2న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అందజేయనున్నట్లు మంత్రి గంగుల తాజా ప్రకటనలో వెల్లడించారు. ఆయా కులాల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా భవనాలను నిర్మిస్తామని, ఆ బాధ్యతలను కూడా ఆయా కులాలకే అప్పగించి త్వరలోనే పనులు పూర్తి చేయిస్తామని వివరించారు. మిగిలిన కుల సంఘాలు కూడా ఏక సంఘాలుగా ఏర్పడితే వెంటనే స్థలాల పత్రాలను అందజేస్తామని మంత్రి గంగుల స్పష్టం చేశారు.