Bathukamma Sambaralu: సింగపూర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్కులో బతుకమ్మ వేడుకలను అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు మొదలైన ఈ వేడుకులకు సింగపూర్లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, పిల్లలు, పెద్దలు అంతా హాజరై జయప్రదం చేశారు. ఆడపడుచులంతా బతుకమ్మ ఆటలాడి అలరించారు. చిన్నారులు స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ, గంతులేస్తూ బతుకమ్మ సంబరాలను ఎంజాయ్ చేశారు. సింగపూర్ వాసులు కూడా ఈ వేడుకలను ఆసక్తిగా తిలకించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కౌ అండ్ ఫార్మర్, సరిగమ రెస్టారెంట్, ఫ్లేవర్స్ రెస్టారెంట్, తందూర్ లాంజ్ రెస్టారెంట్, జానిక్ కంపెనీ ఇన్కార్పోరేషన్స్, జీఐజీ ఇంటర్నేషనల్ స్కూల్, వేలన్ సూపర్ మార్ట్, మెగా గ్రాసరీ మార్ట్ల వారికి నిర్వాహకురాలు కురిచేటి స్వాతి ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాదాపు 4 గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 1700 మంది హాజరైనారని, ఆహుతులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశామని, సింగపూర్ తెలుగు సమాజాన్ని అన్ని వేళలా ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తెలుగు వారందరికీ కృతజ్ఞతాభినందనలు చెప్పారు.