ప్రజారోగ్యమే లక్ష్యంగా సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బస్తీ వైద్యశాలల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అన్ని ప్రధాన హాస్పిటల్స్లో ఆధునిక వైద్యసదుపాయాలతో మెరుగైన వైద్యం అందిస్తుండగా మున్సిపాలిటీల్లో ఈ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏడు బస్తీ దవాఖానలు మంజూరు కాగా ఇక పట్టణ, నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది.
కార్పొరేషన్, మార్చి 27: పట్టణాలు, నగరాల్లో మరింతగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దావాఖానలు తీసుకువచ్చింది. ఇప్పటికే హైదరాబాద్లో వీటిని ఏర్పాటు చేసిన విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఏర్పాటు చేసేందుకు గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో కొత్తగా 40 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తుండగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు 7 మంజూరయ్యాయి. వీటిల్లో కరీంనగర్ నగరపాలక సంస్థలో 2, రామగుండంలో రెండు, జగిత్యాల మున్సిపాలిటీలో 2, సిరిసిల్ల మున్సిపాలిటీకి ఒకటి మంజూరు చేశారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న అర్బన్ హెల్త్ కేంద్రాలకు తోడుగా ఈ బస్తీ దవాఖానాలు పని చేయనున్నాయి. వీటి ఏర్పాటుతో నగర, పట్టణ ప్రజలకు ప్రభుత్వం నుంచి మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ నెల 10న ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించి ఆయా వివరాలను జిల్లా యంత్రాగం, జిల్లా వైద్య శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇప్పటికే 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ పని చేస్తున్నాయి. వీటికి తోడుగా ప్రస్తుతం మరో రెండు బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నగరపాలక అధికారులు పలు స్థలాలను పరిశీలించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఈ దవాఖానాను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలం, తదితర వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.
బస్తీ దవాఖానాలకు సంబంధించి రిజిస్టర్ చేసుకునేందుకు, వెయిటింగ్ ఏరియా, పరీక్షలు చేసే స్థలం, ఓపీడీ, మందుల షాపు, ట్రీట్మెంట్ అందించే వీలుగా, కౌన్సెలింగ్, వెల్నెస్, ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉండేలా చూడాలని సూచనలు చేశారు. పూర్తిస్థాయిలో ఈ దవాఖనాలు ఏర్పాటు చేసే ప్రాంతంలో నీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలని, అలాగే వీటిల్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఇద్దరు సహాయ స్టాఫ్, ఉండేలా చూడాలని, తప్పనిసరిగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ దవాఖానలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి ఏర్పాటుకు సంబంధిత నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే రోగులకు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని ప్రజలకు ఈ దవాఖానాల వల్ల పూర్తిస్థాయిలో స్థానికంగా మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లో కొనసాగుతున్న వాటిల్లో స్థానిక వైద్యులు పరీక్షలు చేయడంతో పాటు, అవసరమైన వారికి టెలీ కన్సల్టేషన్ అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సదుపాయాలు ఆయా వైద్యశాలల్లో అందిస్తున్నారు. నగరంలోనూ బస్తీ దవాఖానలు వస్తే ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటీవల రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో నిర్వహించిన సమీక్షలోనూ వెంటనే వీటి ఏర్పాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు సూచించారు. దీంతో నగరంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు.