Home Loans | ఇంటి రుణంతోపాటు పర్సనల్ లోన్, వెహికల్ లోన్, బిజినెస్ లోన్ తదితర రుణాల కీలక వడ్డీరేట్లు పెంచేసిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కూడా చేరింది. బీవోబీ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ ఆన్ ది లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 15 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. పెంచిన ఎంసీఎల్ఆర్ మంగళవారం (2022 జూలై 12) నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఎంసీఎల్ఆర్ పెంచడంతో కార్లు, వ్యక్తిగత, ఇండ్ల రుణాలు మరింత ప్రియం కానున్నాయి. దీని ప్రభావంతో ఆయా రుణాలపై నెలసరి రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపులు పెరుగుతాయి. ఓవర్ నైట్ నుంచి నెల రోజుల గడువు గల స్వల్పకాలిక రుణాలపై ఎంసీఎల్ఆర్ను బీవోబీ యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా పెంపుతో ఏడాది గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.65 శాతానికి చేరుతుందని బీఎస్ఈ ఫైలింగ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. మూడు నెలల గడువు గల రుణంపై ఎంసీఎల్ఆర్ 7.35 శాతానికి, ఆరు నెలల టెన్యూర్ రుణంపై 7.45 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. ఏడాది గడువు రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.50 శాతం నుంచి 7.65 శాతానికి పెంచేసినట్లు తెలిపింది. 15 రోజుల (ఓవర్నైట్) గడువు రుణాలపై 6.80 శాతం, నెల రోజుల టెన్యూర్ రుణంపై 7.20 శాతం ఎంసీఎల్ఆర్ యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
కొత్తగా రుణాలు తీసుకునే వారికి, పాత రుణ గ్రహీతలకు పెరిగిన ఎంసీఎల్ఆర్ వర్తిస్తుంది. అంటే అధిక వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి. మరో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సోమవారం నుంచి ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. గతవారం ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకులు వివిధ రుణాలపై తమ ఎంసీఎల్ఆర్ రేట్లు పెంచేశాయి.