హుజూరాబాద్: అబద్ధాల బీజేపీకి ఉప ఎన్నికల్లో సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎకరం అమ్మితే ఎన్నికల్లో గెలుస్తానన్న ఈటల రాజేందర్.. బొట్టుబిళ్లలు, గడియారాలు, మిక్సీలు, గొడుగులు క్వార్టర్ బాటిళ్లకు ఎన్నిఎకరాలు అమ్మి ఖర్చు పెడుతున్నావో చెప్పాలన్నారు. నిత్యం నీ కోళ్లఫారం నుంచి నియోజకవర్గ ప్రజలకు ఇంటింటికీ చికెన్ పంచుతుంది నిజం కదా అన్నారు. ఓటుకు రూ.5వేలు, ఇంటికో ఫుల్బాటిల్ మద్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈటల టీఆర్ఎస్ ఓటుకు రూ.20వేలు ఇస్తారని తప్పుదోవ పట్టించడం వెనుక ఆంతర్యమేంటన్నారు.
ఓటర్లను భయపెట్టించేందుకు కేంద్రం నుంచి 2వేల మంది పారా మిలటరీ బలగాలను దించి ఓటర్లను భయపెట్టాలని బీజేపీ చూస్తుందని సుమన్ మండిపడ్డారు. దేశ చరిత్రలో ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత మంది మిలటరీలను దించడం ఎన్నడు లేదన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ సభను అడ్డుకున్న నీచ సంస్కృతి బీజేపీది అని ఆయన అన్నారు. దళితబంధు ఆపాలని ఎన్నికలకు లేఖ రాసింది బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి కాదా చెప్పాలన్నారు. ఉద్యమ వీరుడిని మంత్రి కిషన్రెడ్డి బానిస అనడం మీ అహంకారానికి నిదర్శనమన్నారు.
2001 నుంచి ఉద్యమంలో ముందుండి పోరాడిన గెల్లు శ్రీనివాస్ పులి లాంటోడని, తెలంగాణ కోసం రాజీనామా చేయని నీవు పిరికి పందవని అన్నారు. సుజనచౌదరి, సువేందు అధికారితో పాటు ఈటల రాజేందర్ వంటి అవినీతిపరులతో బీజేపీ నిండిపోయిందన్నారు. అబద్ధాల బీజేపీని ఓటుతో పాతరేసి అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్కు పట్టం కట్టాలని బాల్క సుమన్ కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ సంగెం ఐలయ్య, నాయకులు నందగిరి మహేందర్రెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు.