అమరావతి : ఏపీలోని హిందూపురం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి, సినీనటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) నామినేషన్ వేశారు. మూడోసారి హిందూపురం (Hindupuram) నుంచి పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటి నుంచి భార్యతో కలిసి నామినేషన్ (Nomination )కు బయలు దేరారు.
ఈ సందర్భంగా ఆర్వో కార్యాలయం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్వో కార్యాలయంలో ఎన్నికల అధికారికి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఇచ్చిన మాటకు కట్టుబడుతారనే నమ్మకంతో ప్రజలు తనపై అభిమానం పెంచుకుంటున్నారని తెలిపారు.
నాన్న ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, అన్ని గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, మురికి కాలువలు నిర్మించానని వెల్లడించారు. కరోనా సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశానని పేర్కొన్నారు. అన్న క్యాంటిన్ ద్వారా ఉచితంగా అన్నదానం చేశామని బాలకృష్ణ వివరించారు.