హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు వెన్నుపోటు పొడవడం వెన్నెతో పెట్టిన విద్య అని తెలంగాణ ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపెల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కందుగుల గ్రామంలో ఆయన ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఈటలకు ఓటు వేయాలని దళితులకు చెబుతున్నాడని, అయితే నిజాయితీ నిలువుటద్దంగా ఉండే దళితులు మాట తప్పరన్నారు.
ఈటల రాజేందర్ మాదిరిగా దళితులకు నీచమైన బుద్ధి లేదని, దళితబంధు పథకం ఇవ్వడం గొప్ప వరమన్నారు. డబ్బులకు దళితులు అమ్ముడు పోరని విషయం ఈటల తెలుసుకోవాలన్నారు. పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకొని నాకే ఓటు వేయమని ఈటల చెప్తుండటం ఆయన వెన్నుపోటు వ్యక్తిత్వానికీ నిదర్శనం అన్నారు. నీ మోసపు మాటలను నమ్మే పరిస్థితిలో దళితులు లేరన్నారు.
దళితుల ఆస్తులను అక్రమంగా గుంజుకొని వేల కోట్ల ఆస్తులు సంపాదించి ఆ ఆస్తులను కాపాడుకోవడం కోసం దళిత బహుజన వ్యతిరేక పార్టీ అయిన మనువాద బీజేపీ పార్టీ లో చేరడం సిగ్గుచేటన్నారు. అనాదిగా అణిచివేతకు గురై ఉన్న దళితజాతిని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి కేసీఆర్ దళితబంధు పేర రూ.10లక్షలు ఇస్తుంటే దానిని నీ పార్టీ నీవు నోటికాడ బుక్క రాకుండా నేల పాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అయ్యా ఈటల కోపం ఉంటే మా వీపు మీద కొట్టుగాని మా పొట్టపై కొట్టకు అని హితవు పలికారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని దళిత జాతికి మంచి చేయడానికి కృషి చేయాలని, లేకుంటే ఓటుతోనే మా దళిత జాతి బుద్ధి చెబుతారన్నా రు. తరతరాలుగా శ్రమ దోపిడీకి గురై వెట్టి చాకిరి చేస్తూ ఈ సమాజ బాగు కోరామని, అలాంటి దళితజాతి నుంచి వ్యక్తిగత ఆస్తులు సంపాదించిన హీనమైన చరిత్ర ఈటల రాజేందర్ది అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట అధికార ప్రతినిధి కుమార్, జిల్లా అధ్యక్షుడు సారంగపాణి, నాయకులు ఇమ్మడి రమేష్, ఇమ్మడి భాగ్య, రొంటాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.