బెంగళూరు : లాక్డౌన్పై కర్ణాటక సీఎం యెడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి కట్టడిని అదుపులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలా? వద్దా? అనే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు బుధవారం తెలిపారు. ‘దేశ ప్రధాని మాట్లాడాల్సి ఉంది. ఆయన ఏం చెప్పినా.. నిర్ణయించినా.. మేం అమలు చేయాలి. తాము ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీరెడ్డి 119వ జయంతి సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసులతో ప్రభుత్వం ఇప్పటికే పాక్షిక లాక్డౌన్ విధించగా.. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే, పాక్షిక లాక్డౌన్తో మహమ్మారి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో గడువు ముగిసిన వెంటనే సంపూర్ణ లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోందని సమాచారం. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుదలపై మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో వైరస్ను అదుపులోకి తీసుకువచ్చేందుకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమని వైద్య నిపుణులు, కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. కర్ణాటకలో మంగళవారం 40,128 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో 22,112 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు 55 శాతంగా నమోదైంది. గత వారం బెంగళూరులో పాజిటివిటీ రేటు 12 శాతంగా ఉండగా.. ఒక్క వారంలోనే 55 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 3 లక్షలకుపైగానే యాక్టిక్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో మంగళవారం కొత్తగా 44,631 కరోనా కేసులు నమోదవగా 288 మంది ప్రాణాలు కోల్పోయారు.