న్యూఢిల్లీ: హైవేలపై ఉన్న టోల్ప్లాజాల వద్ద వెయిటింగ్ టైమ్ తగ్గినట్లు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫాస్ట్ట్యాగ్ను ప్రవేశపెట్టిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తక్కువైనట్లు ఆయన వెల్లడించారు. ట్రావెల్ టైమ్ను మరింత తగ్గించేందుకు జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కూడా మంత్రి అభిప్రాయపడ్డారు. ఫాస్ట్ట్యాగ్ వల్ల టోల్ప్లాజాల వద్ద రద్దీ తగ్గిందని, 2018-19 సంవత్సరంలో టోల్ప్లాజా వద్ద సగటు వెయిటింగ్ సమయం 8 నిమిషాలు ఉండేదని, కానీ 2020-21, 2021-22 సంవత్సరాల్లో ఫాస్ట్ట్యాగ్ల వల్ల ఆ సగటు వెయిటింగ్ సమయం 47 సెకన్లకు తగ్గినట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు.
ఇక జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానం వల్ల వెయిటింగ్ సమయం మరింత తగ్గుతుందని, టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదని, ప్రయాణం చేసిన డిస్టెన్స్ ఆధారంగా టోల్ను వసూల్ చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.