సంగారెడ్డి, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తూ ఐఐటీ హైదరాబాద్ సత్తాచాటుతున్నది. ఐఐటీ హైదరాబాద్ పీహెచ్డీ స్కాలర్ ప్రియబత్ర రౌత్రే రూపొందించిన వ్యక్తిగత వైమానిక వాహనాల (పీఏవీ) డిజైన్లను శుక్రవారం ప్రదర్శించారు. ప్రియబత్ర రెండేండ్లుగా పనిచేసి 400 డిజైన్లు సిద్ధం చేయగా, అందులో 28 ఎంపిక చేసి ప్రదర్శించారు. ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బీఎస్ మూర్తి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. రాబోయే కాలం వ్యక్తిగత వైమానిక వాహనాలదే అని ఆయన పేర్కొన్నారు. పీఏవీ తయారీకి అవసరమైన ఎయిరో డైనమిక్స్, మెటీరియల్, నావిగేషన్ సిస్టమ్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలు చేయనున్నట్టు చెప్పారు. ప్రదర్శనలో ఉంచిన 28 డిజైన్లలో నాలుగింటిని ఎంపిక చేసి వాటి ప్రోటో టైప్ డిజైన్లు తయారు చేస్తామని చెప్పారు. ప్రోటోటైప్ డిజైన్లు పూర్తయిన తర్వాత పీఏవీ తయారీపై పరిశోధనలు జరుగుతాయని వెల్లడించారు.
స్వయంప్రతిపత్తిగల(అటానమస్) ఎలక్ట్రిక్ వాహనాన్ని ఐఐటీ హైదరాబాద్ ఇటీవల తయారు చేసింది. జూలై 4న అటానమస్ వాహన సేవలను కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ప్రారంభించి, అదే వాహనంలో క్యాంపస్లో ప్రయాణిస్తారని ఐఐటీ వర్గాలు తెలిపాయి. ఐఐటీహెచ్ తయారుచేసిన అటానమస్ ప్యాసింజర్ డ్రోన్ను సైతం వారంరోజుల్లో పరీక్షించనున్నారు. బ్యాటరీ సాయంతో పనిచేసే అటానమస్ సైకిల్ను సైతం రూపొందించారు. సరికొత్త నావిగేషన్ ఇతర ఫీచర్స్తో ఐఐటీ హైదరాబాద్ రాబోయే ఆరు నెలల్లో అటానమస్ ఎలక్ట్రిక్ సైకిల్ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలు, నూతన ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్నదని ఈ సందర్భంగా డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ దీపక్ మాథ్యూ, ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.