లక్నో, ఫిబ్రవరి 19: యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు ప్రజల నుంచి అడుగడుగున చీత్కారాలు, ఈసడింపులే ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ నాయకులు ఓట్లు అడగడానికి తమ ఊళ్లల్లోకి రావొద్దంటూ పలు గ్రామస్థులు పొలిమేరల్లోనే బోర్డులు పెట్టడం చూశాం. ఇప్పుడు ఈ నిరసన సెగ ఏకంగా రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కి కూడా తగిలింది. రాష్ట్రంలోని గోండా జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో రాజ్నాథ్ ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో సభకు హాజరైన జనంలో నుంచి కొందరు యువకులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘సేనా భర్తీ చాలూ కరో.. హమారీ మాంగే పూరీ కరో (ఆర్మీలో ఉద్యోగాలను భర్తీ చేయండి. మా డిమాండ్ను నెరవేర్చండి)’ అంటూ నినదించారు. దీంతో ఏమి చేయాలో తోచని మంత్రి.. కాసేపు ఆలోచించి.. ‘ఆందోళన వద్దు. కరోనా కారణంగా కొన్ని సమస్యలు తలెత్తాయి. ఉద్యోగాల్ని తప్పకుండా భర్తీ చేస్తాం’ అని సర్ది చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
హోలీ, దీపావళికి ఉచితంగా సిలిండర్
అధికారంలోకి రాగానే గ్యాస్ ధరలను ఎడాపెడా పెంచేసిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందడానికి ఉచిత హామీలను తెరపైకి తీసుకొస్తున్నది. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే వెయ్యి రూపాయలు దాటిపోయింది. గ్యాస్ భారాన్ని తట్టుకోలేని సామాన్యులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభావం ఐదురాష్ర్టాల ఎన్నికల ఫలితాలపై ఎక్కడ పడుతుందోనని భయపడిన కమలదళం.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఉచిత హామీలు మొదలెట్టింది. యూపీలో బీజేపీకి మళ్లీ అధికారాన్ని అప్పగిస్తే హోలీ, దీపావళికి ప్రతీఏటా గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని రాజ్నాథ్ శనివారం హామీ ఇచ్చారు.