గువాహటి: హిజ్రాల కోసం అస్సాం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా టీకాల కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. గువాహటిలోని హిజ్రాల సంరక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హిజ్రాల ప్రధాన వృత్తి భిక్షాటన అని, రోజూ జనాల చుట్టూ తిరుగుతారు కనుక వారికి కరోనా నుంచి అధిక రక్షణ అవసరమని అఖిల అసోం ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, అసోం ప్రభుత్వ ట్రాన్స్ జెండర్ బోర్డు వైస్-చైర్ పర్సన్ స్వాతి బిధాన్ బారువా తెలిపారు. నిస్సహాయ వర్గాలకు చెందిన హిజ్రాలకు టీకాలు వేయడంలో సహజంగానే అలసత్వం ఉంటుందని, ఆరోగ్య శాఖకు వివరిస్తే వారు వెంటనే టీకాలు వేసేందుకు ముందుకు వచ్చారని ఆమె వివరించారు. మొత్తం మీద ఎలాంటి సమస్యా లేకుండా హిజ్రాల టీకాల కార్యక్రమం సాగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం గువాహటికి పరిమితమైన ఈ డ్రైవ్ తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.