గతమెంతో ఘనం..ఎందుకంటే షట్ చక్రవర్తుల్లో ఒకరైన సగర చక్రవర్తి వారసులు వారు..వర్తమానం అగమ్యగోచరం..భగీరథుడి వంశస్థులైన వారు దశాబ్దాలుగా ఉనికి లేని ఉప్పరులుగా కొనసాగిన తీరు..భవిష్యత్తు ఆశాజనకం..ఇప్పుడిప్పుడే వస్తున్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో తమకంటూ ఒక గుర్తింపు సాధిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికీ పలుచోట్ల చెరువుల వద్ద నీరటితనం చేస్తూ, పంట పొలాలకు సమాన నిష్పత్తిలో నీరు వదిలే బాధ్యతను సగరులే నిర్వహిస్తున్నారు. అనేక ప్రాంతాలో నిర్మాణ రంగాన్ని కులవృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. చెరుపులు తవ్వటం, కాలువలు తవ్వటం, ప్రాజెక్టులు కట్టటం ఇలా ఒక్కటేమిటి..కష్టాన్ని నమ్ముకొని మట్టిజీవులుగా బతుకు బండిని లాగుతున్న సగరులు అప్పట్లో బడా కాంట్రాక్టర్లుగా గుర్తింపు పొందారు కాబోలు..అందుకే బీసీ రిజర్వేషన్లలో దాదాపు ఉన్నత కులాల సరసన బీసీ-డీగా గుర్తింపు పొందేలా చేశారు.
మురళీధరన్, అనంతరామన్ లాంటి అనేక కమిషన్లు సగరుల జీవనస్థితిగతులను, వారి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి వీరిని బీసీ-ఏలో చేర్చాలని సిఫారసు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికీ తాగు నీరు అందించే రక్షిత నీటి పథకానికి భగీరథుడి పేరు పెట్టడంతో యావత్ నగర జాతి సంతోషించింది. కొన్ని జీఓలు తీసుకొచ్చి భవన నిర్మాణ పనుల్లో ధరావతు లేకుండా కొంత శాతం పనుల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకున్నది. ఆత్మగౌరవ భవనాల పేరిట కోకాపేటలో సగరులకు రెండెకరాల స్థలాన్ని కేటాయించడం అభినందనీయం.
రాష్ట్రంలో దాదాపు 7 లక్షలకు పైగా నగర జనాభా ఉండగా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బీసీ జనగణన గణాంకాలు సగరులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కేవలం ఒక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు రెండున్నర లక్షలకు పైగా సగర జనాభా ఉండగా తెలంగాణ రాష్ట్రమంతటా లక్షా ఇరవై నాలుగువేల జనాభా మాత్రమే ఉన్నదని ప్రకటించడం పట్ల సగరులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పాలకులు తమ జనాభాను కేవలం (0.03 శాతం)గా చూపడాన్ని సగరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం తాజాగా వెల్లడించిన జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం జరిపే జనగణనలో పరిగణనలోకి తీసుకుంటే ఇలాంటి కులాలు నష్టపోయే ప్రమాదం ఉన్నది. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తే తెలంగాణలోని 132 బీసీ కులాలకు ఎంతో కొంత న్యాయం దక్కే అవకాశాలు లేకపోలేదు. సగరుల జనాభా గురించి తక్కువ చేసి చూపిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరిచేసుకొని వాస్తవాలు వెల్లడించాలి.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ సగర భగీరథ ఆత్మగౌరవ భవన ట్రస్ట్)
-ఆస్కాని మారుతి సాగర్
90107 56666