గౌహతి : అస్సోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. చివరిరోజు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ తరఫున మూడు చోట్ల ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ 6 చోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు.
సాధ్యమైనన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేలా జాగ్రత్త పడ్డారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ప్రచారంలో ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే జరిగిన రెండు విడుతల ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చిందని, చివరి విడుత ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకుంటుందని అన్నారు.
మహాజోట్ కూటమి నేతలు సైతం అధికారం తామదేనంటూ పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏఐయూడీ) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడుతూ.. ఈ సారి రాష్ట్రంలో అధికారం దక్కించుకోబోచేది టోపీ, లుంగీవాలాలేనని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత దిలీప్ సకియా స్పందించారు. బద్రుద్దీన్కు రాష్ట్ర రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు. అస్సాంలో ఏర్పడబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
రెండు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో ఎగువ, మధ్య అసోంలో పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని చెప్పారు. చివరి విడుత ఎన్నికల్లో 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ నెల 6న పోలింగ్ జరుగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి