కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హౌరాలోని ఒక స్వీట్ షాప్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మమతా బెనర్జీల విగ్రహాలతో కూడిన స్వీట్లు ఆకట్టుకుంటున్నాయి. మోదీ గడ్డంతో ఉండగా, మమత వీల్చైర్లో, కాలికి బ్యాండేజీతో ఉన్నారు. లెఫ్ట్, కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో కూడిన సంయుక్త మోర్చా విగ్రహం స్వీటును కూడా ఏర్పాటు చేశారు.
లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బోస్, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ అధిర్ రంజన్ చౌదరి, ఐఎస్ఎఫ్ చీఫ్ అబ్బాస్ సిద్దిఖీని కలిపి మూడు తలల విగ్రహం స్వీటును తయారు చేశారు. అంతేగాక టీఎంసీ, బీజేపీ గుర్తులను పోలిన స్వీట్లను కూడా ఈ షాపులో అమ్ముతున్నారు.
స్వీట్లతో తయారు చేసిన ఈ విగ్రహాలు ఆరు నెలల వరకు పాడవ్వవని షాపు యజమాని హల్దార్ తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సందేశాన్ని తెలియజేసేందుకు స్వీట్లతో మమత, మోదీ, ఇతర నేతల విగ్రహాలు తయారు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసినా, ఎన్నికలు ప్రశాంతగా జరుగడం, అభివృద్ధి కోసం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ముఖ్యమన్నారు.