ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ, వారాంతరాల్లో లాక్డౌన్ అమలు చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులు మరోసారి ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తారన్న భయంతో సొంతూర్లకు ప్రయాణమవుతున్నారు. దీంతో ముంబైలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు వలస కార్మికులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.
మరో లాక్డౌన్ విధిస్తారని తాము భయపడుతున్నట్లు వలస కార్మికులు తెలిపారు. గత లాక్డౌన్ సమయంలో పనులు లేక తమ వద్ద డబ్బులన్నీ ఖర్చయ్యాయని, తమ కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని చెప్పారు. మరోసారి అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పొరుగు రాష్ట్రాల్లోని తమ సొంత ఊర్లకు వెళ్తున్నట్లు వెల్లడించారు.