డిస్పూర్ : ఎల్ఏసీలో చైనా కదలికలను గుర్తించి, అడ్డుకట్ట వేసేందుకు అసోంలోని మిసామరి ఆర్మీ ఏవియేషన్ బేస్ వద్ద హెరాన్ మార్క్ -1 డ్రోన్ను నిఘా కోసం సైన్యం మోహరించింది. భారత్ ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నది. హెరాన్ మార్క్ -1 డ్రోన్ దాదాపు 30వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతూ.. సరిహద్దుల్లో చైనా ఆర్మీ కదలికలను పసిగట్టడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. డ్రోన్ సహాయంతో వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రు సైన్యం కదలికలు, చేపడుతున్న సన్నాహాలు, నిర్మాణాలను పర్యవేక్షిస్తూ భారత భూభాగాన్ని కాపాడుకోవడానికి సైన్యానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వనుంది.
ఇటీవల భారత ఆర్మీ ఇజ్రాయెల్ నుంచి హెరాన్ మార్క్-2 డ్రోన్ల కొనుగోలుకు సైతం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ డ్రోన్లు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, ఎక్కువ ఎత్తు, సుదూర ప్రాంతాల వరకు ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతం. గతేడాది జూన్ లఢఖ్లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నాటి నుంచి వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాల సైనిక అధికారుల మధ్య 13 రౌండ్ల పాటు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు.