పాట్నా, మార్చి 7: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడంపై జేడీయూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర ఉందని వారు ఆరోపిస్తూ జేడీయూ కార్యాలయం వెలుపల శనివారం కూడా పార్టీ కార్యకర్తలు నిరసనలు కొనసాగించారు. శుక్రవారం నిరసనల్లో భాగంగా జేడీయూ కార్యకర్తలు కొందరు ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లకు నల్ల రంగు పులిమారు.
రాజ్యసభకు వెళ్లవద్దని తమ అధినేత నితీశ్ని అభ్యర్థిస్తూ పార్టీ కార్యకర్తల పేరిట పాట్నా వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ఇదిలా ఉంటే సీఎం పదవికి నితీశ్ కుమార్ ఈ నెల 10-14 మధ్య రాజీనామా చేస్తారని తెలుస్తున్నది. నితీశ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ, జేడీయూ మధ్య చర్చలు జరుగుతున్నాయి. శనివారం నితీశ్ తన నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమయ్యారు. సమావేశానికి హాజరైన పలువురు ఎమ్మెల్యేలు రాజ్యసభకు వెళ్లాలన్న నితీశ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ తన నిర్ణయాన్ని వ్యతిరేకించవద్దని, తాను రాజ్యసభకు వెళుతున్నానని, అక్కడి నుంచే అన్ని విషయాలను గమనిస్తుంటానని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. చర్చ సందర్భంగా నితీశ్ భావోద్వేగానికి గురైనట్లు సమావేశంలో పాల్గొన్న జేడీయూ ఎమ్మెల్యే వినయ్ చౌదరి తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు కంటతడి పెట్టుకున్నారని చెప్పారు. అనంతరం నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ ప్రవేశాన్ని ఆమోదిస్త్తూ ఎమ్మెల్యేలు అందరూ చేతులు పైకెత్తి బలపరిచారు. మార్చి 8న నిశాంత్ కుమార్ అధికారికంగా జేడీయూలో చేరనున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు నితీశ్ని విడివిడిగా కలిశారు.