కట్టంగూర్, జూలై 22 : గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొజ్జ చిన వెంకులు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేసి సమస్యలను అడిగి తెలుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 436 మంది విద్యార్థినులకు కేవలం 20 మరుగుదొడ్లు, ఆరుగురు వంట సిబ్బంది మాత్రమే ఉండడం వల్ల పాఠశాలలో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. మరుగుదొడ్లను 50, మరో ఇద్దరు వంట సిబ్బందిని పెంచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మెస్ చార్జిలను పెంచి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఇటికాల సురేందర్, చింత సందీప్ పాల్గొన్నారు.