ఆలేరు, ఆగస్టు 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కిడ్నీ బాధితులకు ఆసరా పింఛన్ ఇస్తామని ప్రకటన చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆలేరులోని డయాలసిస్ సెంటర్లో ఆదివారం రోగులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయాలసిస్ బాధితులకు రూ.2016 పింఛన్ ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారన్నారు. తొలి విడుతలో సుమారు 12వేల మంది డయాలసిస్ పేషెంట్లకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ ఇప్పటికే వివరాలను సేకరించిందన్నారు.
రాష్ట్రంలో డయాలసిస్ రోగులు పెరిగిపోతున్నారని, ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకోవడం భారంగా మారిందని, ఈ తరుణంలో పింఛన్ ప్రకటించడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. డయాలసిస్ బాధితుల ఇబ్బందులను తాను అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోని బాధితులకు డయాలసిస్ సెంటర్ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, కౌన్సిలర్లు బేతి రాములు, రాయపురం నర్సింహులు, మార్కెట్ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, నాయకులు పంతం కృష్ణ, దాసి సంతోష్, బాలస్వామి, రామకృష్ణ పాల్గొన్నారు.