న్యూఢిల్లీ : దేశంలో బలహీన వర్గాలు, అణగారిన వారు లబ్ధి పొందేందుకు రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం భారత్లో బలహీన ప్రధాని అవసరమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బలమైన ప్రధాని కేవలం బలవంతులకే సాయపడుతున్నారని ఆరోపించారు. బలమైన ప్రధానిని మనం చూశాం..ఈసారి బలహీనులకు లబ్ధి చేకూర్చే బలహీన ప్రధాని దేశానికి అవసరమని తాను భావిస్తున్నానని అసదుద్దీన్ వ్యంగ్యంగా అన్నారు.
అహ్మదాబాద్లో శనివారం విలేకరుల సమావేశంలో ఓవైసీ మాట్లాడుతూ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపన్నులకే మేలు చేస్తున్నారని ఆరోపించారు. బహుళ పార్టీ ప్రభుత్వం దేశానికి కావాలని, బలహీన ప్రధాని పగ్గాలు చేపడితే బలహీనవర్గాలు లాభపడతాయని చెప్పుకొచ్చారు. దృఢమైన నేత ప్రధానిగా వస్తే బలవంతులే బలపడుతున్నారని అన్నారు. 2024లో ఈ దిశగా తాము పోరాడతామని ఏం జరుగుతుందో చూడాలని ఓవైసీ వ్యాఖ్యానించారు.
బీజేపీకి 306 మంది ఎంపీలున్నా వ్యవస్ధ తనను పని చేయనివ్వడం లేదని ప్రధాని మోదీ ఫిర్యాదు చేస్తుంటారని, పేదలు, రైతులు, యువతకు మేలు చేసేందుకు ఆయనకు ఇంకా ఏం అధికారాలు కావాలని ప్రశ్నించారు. నిరుద్యోగం, ధరల మంట, చైనా ఆక్రమణ, కార్పొరేట్ ట్యాక్స్ రద్దు వంటి ప్రశ్నలు ఎదురైతే అత్యంత శక్తివంతమైన ప్రధాని వ్యవస్ధను నిందిస్తుంటారని ఎద్దేవా చేశారు.