మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సెట్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయని అంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్. కీర్తి సురేష్ నాయికగా దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఫ్లస్ పతాకాలపై నవీన్ యేర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మాట్లాడుతూ…‘మహేష్ బాబుతో గతంలో ఆరు చిత్రాలకు పనిచేశాను. ఇది ఏడవ సినిమా. ఈ చిత్రంలో బ్యాంక్ సెట్ను అన్నపూర్ణ స్టూడియోస్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. గతంలో బ్యాంక్లు ఎలా ఉండేవో సహజంగా అలా నిర్మించాం. పాటల్లోనూ కొన్ని సెట్స్ వేశాం. మహేష్ బాబు ఔట్ డోర్ షూటింగ్కు ఇష్టపడరు. సినిమా అంతా సెట్స్లోనే జరుగుతుంది. కానీ చాలా చోట్ల అవి సహజంగా బయటకు వెళ్లి చేసినట్లు కనిపిస్తాయి. మేం వేసిన సెట్ను సెట్ కాదని అనిపించేలా చేయడమే మాకొక అవార్డులా భావిస్తాం. సెట్స్ వల్ల సినిమాను మనం కోరుకున్నంత అందంగా రూపొందించవచ్చు. మహేష్ బాబుకు ప్రతి సాంకేతిక విభాగం మీద అవగాహన ఉంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఆర్ట్ వర్క్లోనూ బడ్జెట్ పెరిగింది. క్వాలిటీగా సినిమా చేయాలనుకున్నప్పుడు ఖర్చు తప్పదు. సోషియో ఫాంటసీ చిత్రానికి పనిచేయాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ‘ఎఫ్ 3’, ‘భోళా శంకర్’, ‘ఎన్బీకే 107’, మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తదితర చిత్రాలకు పనిచేస్తున్నా’ అని అన్నారు.