బెంగళూర్ : ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన లింగాయత్ స్వామీజీ శివమూర్తి మురుగపై చేపట్టిన దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయని పోలీసులు చెబుతున్నారు. పదేండ్లకు పైగా మైనర్ బాలికలను శివమూర్తి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని వెల్లడించారు. నిందితుడు శివమూర్తి ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లా జైలులో ఉన్నాడు.
చిత్రదుర్గ మురుగ మఠంలో ఆయన పదేండ్లకు పైగా బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసి తన పశువాంఛను తీర్చుకుంటున్నాడని పలువురు తమ స్టేట్మెంట్స్లో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. గతంలో ఇదే మఠంలో పనిచేసిన శరణానంద స్వామీజీ శివమూర్తి లీలలను వెల్లడించారు. శివమూర్తి బాధితులు పెద్దసంఖ్యలో ఉన్నారని పలువురు బాధితులకు అబార్షన్లు కాగా, మరికొందరు ఆయన ఆగడాలు భరిచంలేక మఠం హాస్టల్ను విడిచి పారిపోయారని చెప్పారు.
నిందితుడు తన కామ వాంఛలను తీర్చుకునేందుకు అనాధ బాలికలకు మఠంలో ఆశ్రయం కల్పించేవాడని శారీరక సుఖాల కోసం ఆయన థాయ్లాండ్ వెళ్లాడని కూడా చెబుతున్నారు. మఠంలో అత్యాధునిక బాత్రూం నిర్మించిన నిందితుడు అక్కడికి మైనర్ బాలికలను పిలిపించి వేధించేవాడని పోలీసులు తెలిపారు. తనతో సహకరించేలా బాలికలను ఒప్పించేందుకు కొందరు బాలురను నిందితుడు ప్రత్యేక బృందాలుగా నియమించాడని తెలిసిందని చెప్పారు.