కవాడిగూడ:ఆంధ్రకు 70 శాతం, తెలంగాణకు 30 శాతం నిష్పత్తిలో కృష్ణా జలాలను పంచాలని కృష్ణా జల వివాద ట్రిబ్యూనల్-2 కు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం సరైంది కాదని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు.తీర్పు వచ్చేవరకు అదే నిష్పత్తిలో కొనసాగాలని , నాగార్జున్సాగర్ ఎడమ విద్యుత్ కేంద్రం, పులిచింతలలో ఉత్పత్తిచేసే విధ్యుత్లో తమకు వాటా ఉందని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాసిన లేఖలో పేర్కొనడాన్ని ఖండిస్తున్నామన్నారు.
శుక్రవారం కవాడిగూడలోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఏపీలో వారి అధికార ఆధిపత్యంలో తెలంగాణపై చూపిన వివక్షతను ఇంకా కొనసాగిస్తామంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతం నీరు నిష్పత్తి, సహజ న్యాయసూత్రాలను అమలు చేస్తున్న, దేశ, విదేశ సూత్రాలకు అనుగుణంగా జరగాల్సి ఉంటుందని, దానికి వ్యతిరేకంగా లేఖ రాయడం వారి కుటీల బుద్దికి నిదర్శనమని అన్నారు.ఏపీ ప్రభుత్వం వాస్తవాలను గుర్తించి ప్రవర్తిస్తే అటు ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన హితవు పలికారు.