సుబ్బరాజుకు కీటో డైట్తో తగ్గిందట. సుబ్రహ్మణ్యం అలోపతి మానేసి ఆయుర్వేదం తీసుకుంటున్నాడట. సుశీల మేడమ్ డాక్టర్ను మార్చాక రోగం తగ్గిపోయిందట. మధుమేహానికి మందులు వృథా. చక్కెర మానేస్తే సరిపోతుంది. యూట్యూబ్ డాక్టర్ల ఉపన్యాసాలు, స్వయం ప్రకటిత వైద్య శిఖామణుల సలహాలు రోగులను అయోమయానికి గురిచేస్తున్నాయి. నిజానికి, చక్కెర వ్యాధిని అదుపులో ఉంచాలంటే మందులు ఎంత ముఖ్యమో, అవగాహనా అంతే అవసరం.
డయాబెటిస్.. ఔషధాలతోనే పూర్తిగా నయం కాదు. వ్యాధిని అదుపులో పెట్టాలంటే మందులతోపాటు జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడానికి ఒక్కొక్కరిలో ఒక్కో కారణం ఉంటుంది. ఆ మూలాల్ని తెలుసుకుని సరైన చికిత్స తీసుకుంటూ.. జీవన విధానంలో ఆరోగ్య కరమైన మార్పులు చేసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు. మధుమేహానికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
ఆరోగ్యవంతులైన వ్యక్తుల డెసీలీటర్ (వంద మిల్లీలీటర్ల) రక్తంలో గ్లూకోజ్.. తినకముందు 100 మిల్లీగ్రాములు, తిన్న తర్వాత 150 మిల్లీగ్రాములు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ లెక్కల్లో అసాధారణమార్పులు వస్తుంటాయి.
తినకముందు 125 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ, తిన్న తర్వాత 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్ బారినపడినట్టు గుర్తించాలి. అలా అని, అందరికీ మందులు అవసరం ఉండకపోవచ్చు. ఇచ్చినా అందరికీ ఒకే మందు ఇవ్వరు. ఇన్సులిన్ కూడా కొద్దిమందికే తప్పనిసరి అవుతుంది. ఫలానా వ్యక్తులు, ఫలానా డైట్ పాటించడం వల్ల మందుల అవసరమేలేనంత పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, షుగర్ స్థాయులు అదుపులో ఉన్నాయని.. ఇలా రకరకాల వార్తలు చెవిన పడుతుంటాయి. ఆ ప్రభావంతో మందుల డబ్బాలను చెత్తబుట్టలో పడేసి, తమ మీద తాము ప్రయోగాలు చేసుకుంటున్నవారు ఎంతోమంది. ఇలాంటి సొంత వైద్యం
ప్రాణాంతకం కావచ్చు.
కొందరిలో డయాబెటిస్ (నియంత్రణలో లేని దశ) రాకముందే సమస్యను గుర్తిస్తారు. వీళ్లలో డెసీ లీటర్ రక్తంలో గ్లూకోజ్.. తినకముందు 125 మిల్లీగ్రాములు, తిన్న తర్వాత 200 మిల్లీగ్రాముల దాకా ఉంటుంది. ఇది ‘ప్రీ డయా
బెటిక్’ దశ. వీళ్లకు మందులు అవసరం లేదు. మధుమేహ రోగికి అనువైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పాటిస్తే సరిపోతుంది. మధుమేహాన్ని వాయిదా వేయవచ్చు. ఇలా, ప్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారు ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండటాన్ని చూసి, మిగతావారు కూడా మందులు లేకుండానే డయాబెటిస్ పోతుందని భ్రమపడుతున్నారు. ప్రీ డయాబెటిక్ దశలో ఏ వైద్యుడూ మందులు సిఫారసు చేయడు. డయాబెటిక్ దశలోనే మందుల అవసరం ఉంటుంది. ఈ వ్యత్యాసం తెలియక చాలామంది ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి.. అంటూ వైద్య విధానాలను మారుస్తూపోతారు. మరికొందరు ఏకంగా డాక్టర్లనూ మార్చేస్తారు. దీనివల్ల రుగ్మత ఇంకా తీవ్రమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మధుమేహానికి ఒకే రకమైన ప్రమాణాలతో వైద్యం చేస్తున్నారు. నిజానికి, డయాబెటిస్ను అదుపు చేయడంలో మందుల ప్రభావం 20 శాతమే. మిగతా 80 శాతం ఆహారం, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది.
తల్లికి కానీ, తండ్రికి కానీ డయాబెటిస్ ఉంటే పిల్లలు ముందే జాగ్రత్తపడాలి. నలభై దగ్గరపడగానే అప్రమత్తం అయిపోవాలి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆహారం, నిద్ర, వ్యాయామం, ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పటికే ప్రీ డయాబెటిక్ దశలో ఉన్నా కూడా ఈ నాలుగు సూత్రాలను పాటిస్తే మందులు, ఇన్సులిన్ అవసరం రాకుండా జాగ్రత్తపడవచ్చు. డయాబెటిస్ దరిదాపుల్లో (బోర్డర్ లైన్) ఉన్నవారు కూడా మందుల అవసరం లేకుండానే నియంత్రించుకోవచ్చు. మధుమేహ స్థాయి నియంత్రించలేని దశకు చేరుకుంటే మాత్రం ఔషధాలు తప్పవు. దానికితోడు జీవనశైలిలో మార్పులు చేసుకుంటేనే ఆ మందులు సమర్థంగా పనిచేస్తాయి. కొంతమందికి ఊబకాయం ఉంటుంది. మరికొందరు ఆల్కహాల్ను వదిలిపెట్టరు. ఇంకొందరు సరిగా తినరు. వేళకు పడుకోరు. బయటి ఆహారానికి బానిసలు అవుతారు. వ్యాయామమే ఉండదు. ఇలాంటి వాళ్లంతా తక్షణం జీవనశైలి లోపాలను సరిచేసుకోవాలి. వ్యాధి ఆరంభ దశలో ఉంటే, మందుల అవసరం లేకుండా మంచి జీవనశైలితో నియంత్రించుకోవచ్చు. అంతేకానీ, షుగర్ స్థాయులు 400, 500 ఉన్నా కూడా మందులు వాడకుండా.. కేవలం జీవనశైలితోనే మధుమేహాన్ని అధిగమించాలని అనుకోవడం దురాశే.
వైద్యులు కొందరికి మందులు, కొందరికి ఇన్సులిన్ సూచిస్తారు. కొందరికి రెండూ అవసరం కావచ్చు. ప్రారంభ దశలోనే జాగ్రత్తపడి తగిన మందులు వాడితే మధుమేహాన్ని రివర్స్ చేయవచ్చు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సమర్థమైన మందులు వాడటం వల్ల రుగ్మత నియంత్రణలోకి వస్తుంది. ఆ సానుకూలమైన మార్పు సాధ్యమైన తర్వాతే.. క్రమంగా డోస్ తగ్గిస్తూ పోతారు. ఓ దశలో మందులు ఆపేయమని చెబుతారు. ఇన్సులిన్ను కూడా నిలిపేస్తారు. అతికొద్దిమంది విషయంలోనే ఇలా జరుగుతుంది.
కొందరు డైట్లో మార్పులు చేసుకోగానే రక్తంలో చక్కెర స్థాయులు తగ్గినట్టు అనిపిస్తుంది. దీంతో మధుమేహాన్ని గెలిచామని అనుకుంటారు. శరీరానికి కావలసిన కార్బొహైడ్రేట్స్ ఇవ్వకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడం సాధారణమైనదే. కానీ, ఇది ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఇంకొంతకాలం అలానే వదిలేస్తే ప్రాణాల మీదికి వస్తుంది. కీటో డైట్ అంటేనే ఆహారంలో కార్బొహైడ్రేట్స్ పరిమాణం తగ్గించి ప్రొటీన్స్, కొవ్వులు పెంచడం. శరీరానికి కార్బొహైడ్రేట్స్ ఇవ్వనప్పుడు ఇక రక్తంలో గ్లూకోజ్ ఎందుకుంటుంది? అప్పుడు శరీరానికి కావలసిన శక్తి ప్రొటీన్, కొవ్వు ద్వారా అందుతుంది. ఇలాంటి సమయంలో రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా ఉంటాయి. అలా అని, డయాబెటిస్ అదుపులోకి వచ్చినట్టు కాదు. కీటో డైట్ తీసుకున్నంత కాలమే ఇలా ఉంటుంది. కీటో డైట్ను ఎక్కువ రోజులు పాటిస్తే శరీరంలోని జీవక్రియ (మెటబాలిజం) అపసవ్యం అవుతుంది. శరీర కణాల్లో కీటోన్ బాడీస్ పెరుగుతాయి. అవయవాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇతర రోగాలు వస్తాయి. గుండెపోటు ప్రమాదం కూడా ఉంది. ఒకటి, రెండు రోజుల ఫలితాలు చూసి మధుమేహం తగ్గిపోయిందనుకుంటే మోసపోతారు.
కొంతమంది పూర్తిగా వంటింటి వైద్యం మీదే ఆధారపడతారు. మెంతులు తింటే మధుమేహం దారికొస్తుందని అనుకుంటారు. నిజమే. మెంతుల్లో డయాబెటిస్ నియంత్రణ కారకాలు ఉంటాయి. కానీ, ఒక మనిషిలో డయాబెటిస్ని తగ్గించేంత మోతాదులో డయాబెటిస్ కంట్రోల్ ఏజెంట్స్ లభించాలంటే రోజుకు రెండు కిలోల మెంతులు తినాలి. అది సాధ్యమేనా? కాబట్టి, శాస్త్రీయ వైద్య విధానంపైనే నమ్మకం ఉంచాలి.
తల్లిదండ్రుల్లో ఎవరికైనా మధుమేహం ఉన్నా, అప్పటికే ప్రీ డయాబెటిక్ స్టేజ్కి చేరినా ఈ జాగ్రత్తలు పాటిస్తే మధుమేహ దుష్ప్రభావాలను తప్పించుకోవచ్చు. కొన్నేండ్లపాటు రుగ్మతను వాయిదా వేసుకోవచ్చు. ఆ ప్రయత్నంలో
ఉపకరించే జీవన విధానం..
ఎండ : శరీరంపై ఎండ పడాలి. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం మూడు గంటలు ఎండలో గడపాలి. దీనివల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాదు, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అనేక వ్యాధులు రావు. ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి.
ఒత్తిడి : ఒత్తిడిని తగ్గించుకోవడానికి పనిలో ప్రణాళిక అవసరం. ఇష్టమైన అభిరుచులకు కొంత సమయం కేటాయించాలి. స్నేహితులు, ఆత్మీయుల మధ్య గడపాలి.
భోజనం : రోజూ ఒకే సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనం ఎనిమిది గంటలలోపు ముగిస్తే మంచిది. భోజనంలో అన్నం లేదా చపాతీ ఒక వంతు, కూరలు, పెరుగు, పచ్చి కూరగాయ ముక్కలు (సలాడ్స్), పండ్లు రెండు వంతులు ఉండేలా చూసుకోవాలి. పీచు అధికంగా ఉండే పదార్థాలు ఎంచుకోవాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత రెండు గంటలకు భోజనం లేదా అల్పాహారం తీసుకోవాలి.
నిద్ర : రోజూ ఉదయమే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. సాధ్యం కాకపోతే ఒకటి రెండు గంటలు సర్దుబాటు చేసుకోవాలి. అయితే తప్పకుండా అదే సమయానికి లేవాలి. నిత్యం ఒకే సమయానికి పడుకోవడం ఉత్తమం. అర్ధరాత్రి తినడం, తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం ఏమంత మంచి అలవాట్లు కావు. పెద్దలకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం.
వ్యాయామం : రోజూ గంట సమయం వ్యాయామానికి లేదా ఆటలకు కేటాయించాలి. వాకింగ్, జాగింగ్, యోగా, ఏరోబిక్స్.. అది ఏమైనా కావచ్చు.
ఆరోగ్యంగా ఉండాలంటే పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్స్), కొవ్వులు (ఫ్యాట్), మాంసకృత్తులు (ప్రొటీన్స్) సమపాళ్లలో తినాలి. సాధారణంగా భారతీయ ఆహారంలో కార్బొహైడ్రేట్స్ 55-60 శాతం, కొవ్వులు 25 శాతం, ప్రొటీన్ 15 శాతం ఉంటాయి. ఇలాంటి ఆహారం కూడా మధుమేహానికి ఒక కారణం. డయాబెటిస్ వచ్చినవాళ్లు తప్పకుండా ‘బ్యాలెన్స్ డైట్’ తీసుకోవాలి. కొంతమంది ఒకే రకమైన ఆహారం తీసు కుంటారు. అన్నం మానేసి చపాతీలు, కొర్రలు తింటే తగ్గుతుందని అనుకుంటారు. నిజానికీ అన్నం తిన్నా ఏమీ కాదు. అన్నంలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువ. అదే గోధుమలు, కొర్రల్లో కార్బొహైడ్రేట్స్ తక్కువ, ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. అయితే డైట్లో కార్బొహైడ్రేట్స్ ఉండాల్సింది 20 శాతమే. కొద్దిపాటి ఆహారం గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతూ, మిగతా ఆహారం గురించి ఆలోచించడం లేదు. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే అన్నం మానేయాల్సిన అవసరమే లేదు. భోజనంలో అన్నం లేదా గోధుమ రొట్టె లేదా కొర్రలు.. ఏదైనా 20 శాతం ఉండాలి. పప్పు, పెరుగు కలిపి 40 శాతం ఉండేలా చూసు కోవాలి. పచ్చి కూరగాయలు (కీరా, టమాట, క్యారెట్, ఉల్లిపాయ మొదలైనవి), పండ్లు (చక్కెరలు ఎక్కువగా ఉండే సపోటా, సీతాఫలం, మామిడి కాకుండా మిగతా ఫలాలు) 40 శాతం ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే అన్నం తిన్నా, గోధుమలు తిన్నా, కొర్రలు తిన్నా ఒక్కటే. కారం, ఉప్పు, నూనె, మసాలాలు, వేపుళ్లు తగ్గించాలి.
డాక్టర్ ఎ. కమలేశ్ జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్
యశోద హాస్పిటల్ సికింద్రాబాద్
నాగవర్ధన్ రాయల