హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను మళ్లీ కలిపేద్దామని, ఒకే రాష్ట్రంగా కలిసి ఉందామని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. గురువారం ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెట్టాలని, తాము గెలిపించుకొంటామని అక్కడివారు అంటున్నారని టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని స్పందించారు.
రెండు రాష్ర్టాలను కలిపేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలలో తీర్మానాలు చేద్దామని ప్రతిపాదించారు. ఇందుకు కేసీఆర్ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. తాము ముందు నుంచీ ఉమ్మడి రాష్ర్టాన్నే కోరుకొంటున్నామని, తెలుగువారికి సమైక్య రాష్ట్రం అవసరమనే విషయాన్ని 2013లోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. రాష్ర్టాన్ని దుర్మార్గంగా విడగొట్టి, నాశనం చేయొద్దని ఆనాడే జగన్ పేర్కొన్నారని పేర్ని వ్యాఖ్యానించారు. ఏపీలో కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరం లేకుండా, అదే పార్టీ పేరుతో పోటీచేయొచ్చని పేర్కొన్నారు.