శ్రీశైలం : భక్తుల మనోభావాలను కాపాడుతూ.. దేవస్థానం పరిధిలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలని ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ జవహర్లాల్ శ్రీశైలం దేవస్థానం అధికారులను ఆదేశించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో ఆయనకు వేదాశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పరిసరాలతోపాటు క్షేత్రంలోని పలు ప్రాంతాలను ఈవోతో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత ఈవో కార్యాలయంలో ప్రధాన విభాగాధిపతులతో సమావేశమయ్యారు.
భక్తులకు అందించే సౌకర్యాలలో వివిధ మార్పుచేర్పులను సూచించారు. ఇప్పటి వరకు యాత్రికులకు మల్లన్న ప్రసాదంగా కేవలం లడ్డూ మాత్రమే ప్రాచుర్యంలో ఉండగా స్వామిఅమ్మవార్లకు శాస్ర్తోక్తంగా చేసే మిగతా నైవేద్యాలను కూడా ప్రసాద విక్రయశాలల్లో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదే విధంగా పరిమళ విభూధి, రుద్రాక్ష మాలలు, వివిధ ముఖాలు కలిగిన రుద్రాక్షలు, స్పటిక లింగాల విశిష్టతలను తెలియజేసే విధంగా విక్రయశాలలో ఉంచాలని తెలిపారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే యాత్రికుల ప్రాంతీయ భాషల్లో ఆలయ సమాచారాన్ని అందించే దిశగా మరింతగా మెరుగుపరచాలని సూచించారు.
నిత్యాన్నదాన సత్రాలవారితో సమీక్షా సమావేశం..
క్షేత్రానికి వచ్చే యాత్రికులకు అల్పాహార భోజన వసతి ఏర్పాట్లను చేయడంలో సత్ర నిర్వాహకులు చేస్తున్న కృషి హర్షనీయమని ఈవో లవన్న అన్నారు. ఉత్సవాలను రద్దీ రోజులను దృష్టిలో ఉంచుకుని సత్రాల సహాయ సహకారాలను కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సత్ర నిర్వాహకులతో మాట్లాడుతూ ప్రతి శని, ఆది సోమవారాల్లో 25 శాతం వసతి గదులను దేవస్థానం సూచించిన వారికి కేటాయించడమే కాకుండా భోజనశాలలో శ్రీశైల టీవీ ప్రసారాలు అందుబాటులో ఉండే విధంగా టీవీలు, ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చెయ్యాలని కోరారు.
అదే విధంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేవస్థాన సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థానం వారికి సహకరించేందుకు సుముఖత చూపుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో తమ వంతు సహకారం అందిస్తామని ఆయా సంత్రాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు అభిప్రాయాలు, సమస్యలను ఈవో దృష్టికి తీసుకువచ్చారు.