తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అకాల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలర్ శేషాద్రి మృతి టీటీడీకి తీరనిలోటని చంద్రబాబు అన్నారు. నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. డాలర్ శేషాద్రి మరణం తీరని లోటని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవని అన్నారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారన్నారు.