ఏపీ సినిమా టికెట్ ధరల విషయంలో చిత్రసీమకు ఊరట లభించింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పాతవిధానంలోనే టికెట్ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును కల్పించింది. పన్నుల విషయంలో పారదర్శకతతో పాటు కొత్త సినిమాలు విడుదలవుతున్న సమయంలో టికెట్ రేట్లను పెంచుతున్న తీరును నియంత్రిస్తూ ప్రభుత్వం గత ఏప్రిల్లో జీవో 35ని జారీచేసింది. ప్రభుత్వ జారీ చేసిన ఈ జీవోపై సినీ వర్గాలు అసంతృప్తిని వ్యక్తంచేశాయి. ఈ ఉత్తర్వులను సవాల్చేస్తూ థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లను పెంచే హక్కు థియేటర్ యాజమాన్యానికి ఉంటుందనే పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ఉన్నతన్యాయస్థానం జీవో 35ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.