హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బాలల హక్కుల పరిరక్షణ భేష్ అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకర్త కైలాశ్ సత్యార్థి ప్రశంసించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో రాష్ట్ర విధానాలు ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. అమెరికాలో వచ్చే నెల 18న జరగనున్న ఐక్యరాజ్య సమితి సదస్సులో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని తెలిపారు.
మంగళవారం ఢిల్లీలో కైలాశ్ సత్యార్థితో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా బాలబాలికలపై దాడుల నివారణ, సంక్షేమం కోసం సత్యార్థి కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బాలబాలికల కోసం అమలవుతున్న పథకాలు, తీసుకుంటున్న చర్యల గురించి వినోద్కుమార్ను అడిగి తెలుసుకొన్నారు.
హైదరాబాద్, వరంగల్, మహబూబాబాద్తోపాటు మరికొన్ని చోట్ల బాలికలు, మహిళా రక్షణకు ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేసినట్టు వినోద్ వివరించారు.బాల్య వివాహాలను అరికట్టడంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలది కీలకపాత్ర అని తెలిపారు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు మాత్రమే ఆ పథకాలు వర్తించనుండటంతో మైనర్లకు వివాహాలు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదని అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఇప్పటివరకూ 11,25,204 మందికి రూ.9,662.76 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ఇవన్నీ విన్న కైలాశ్ సత్యార్థి.. తెలంగాణలో అమలు చేస్తున్న విధానాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. సెప్టెంబర్ 18వ తేదీని బాలల హక్కులు, బాల్య వివాహాల నివారణ దినోత్సవంగా జరుపుకొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్టోబర్లో వరంగల్లో నిర్వహించనున్న బాలల రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరుకావాలని వినోద్కుమార్ కోరగా, కైలాశ్ సత్యార్థి సానుకూలంగా స్పందించారు.