హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అమూల్ సంస్థ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. రఘునందన్రావు గురువారం ‘గుజరాత్ అమూల్ మిల్క్ డెయిరీకి స్వాగతం పలికిన మంత్రి కేటీఆర్. గుజరాతీ గులాములు ఎవరో ఇప్పుడైనా చెప్పగలరా?’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, విధానాలను మెచ్చి అమూల్ సంస్థ స్వయంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెడుతామని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు బుధవారం మంత్రి కేటీఆర్తో చర్చలు జరిపారు. అంతేతప్ప తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు గుజరాత్కు వెళ్లి అమూల్ను బతిమిలాడుకోలేదు. ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తూ ఘాటు వ్యాఖ్యలతో రఘునందన్రావుకు చురకలు అంటించారు. ‘రఘునందన్.. తెలంగాణ ఇండస్ట్రీ పాలసీ చూసి అమూల్ వచ్చింది. ఇక్కడికి దేశవిదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు. దీన్ని ఉపాధిగిరి అంటారు’ అని ఓ నెటిజన్ చురక అంటించారు.
‘గుజరాత్ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెడితే ఎవరు ఎవరికి గులాం అయినట్టు?’ అని మరొకరు ప్రశ్నించారు. ‘మీరు వాళ్ల ముందు తలవంచితే, వాళ్లే తలాడిస్తూ రాష్ర్టానికి వచ్చేలా మంత్రి కేటీఆర్ చేశారని చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యింది’ అని మరో నెటిజన్ ఫైర్ అయ్యారు. ‘మీ తెలివి తెల్లార. అమూల్ తెలంగాణకు వచ్చిందంటే తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం, సంస్కరణలు, నిబద్ధత ఉండబట్టి. గుజరాతీ బానిసల మాటలు పక్కన పెట్టి అమూల్ సంస్థ తెలంగాణ ప్రజల కోసం వచ్చింది’ అని ఇంకో నెటిజన్ ఘాటుగా స్పందించారు. ‘కిటెక్స్ తెలంగాణకు వస్తే మీ బీజేపీ కేంద్ర మంత్రి కర్ణాటకకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అప్పుడు మీరు మాట్లాడలేదు. దానినే గులాంగిరి అంటారు’ అని ఓ నెటిజన్ ఎద్దేవాచేశారు.