బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని గార్ల బయ్యారం సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు సందర్శించారు. స్థానికల వద్ద నుంచి వివరాలు సేకరించారు. అయితే గత రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోట పోటీగా అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేయగా ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకోగా కొన్ని రోజులపాటు విగ్రహాల ఆవిష్కరణ వాయిదా పడింది.
అనంతరం వేరువేరుగా రెండు విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలు గ్రామానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.