చరిత్రలో గొప్ప గొప్ప నాయకుల గురించి చదువుకుని ఉంటాం. వాళ్లు చేసిన మంచి పనులు, భావి భారత నిర్మాణం కోసం, భవిష్యత్ తరాల కోసం వారు చేసిన కృషిని చూసి మనం స్ఫూర్తిని పొందుతాం. అలాంటి వారిలో అగ్రస్థానంలో ఉంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దళిత, పీడిత ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన వ్యక్తిగానే ఆయన చాలామందికి తెలుసు. ఎందుకంటే చాలామంది ఆయనను అంతవరకే పరిమితం చేసి చూపెట్టారు. కానీ ఆయన మన రాజ్యాంగ నిర్మాత అన్న మాట మరిచిపోవద్దు. దేశం ఎలా ఉండాలి? ఏం చేయాలి? పాలకులకు ఉండాల్సిన అధికారాలేమిటి? పౌరులకు ఉండాల్సిన హక్కులేమిటి? ఇలా ప్రతి దాన్ని సునిశితంగా పరిశీలించి, కూలంకుషంగా అధ్యయనం చేసి మనకు రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా భారత్ ఉందంటే అది అంబేద్కర్ చలవే. స్వాతంత్య్రం వచ్చాక భావిభారతం ఎలా ఉం డాలి అనే దూరదృష్టితో మనకు మార్గనిర్దేశనం చేసి న గొప్ప శక్తి అంబేద్కర్. సమసమాజ స్థాపనే లక్ష్యం గా ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. ఆయన పేద, బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి. అంబేద్కర్ మాటలు చెప్పి ఊరుకోలేదు. ఆ దిశగా పటిష్ఠమైన చట్టాలు ఉండేలా రాజ్యాంగంలో పొందుపరిచారు. పేద,దళిత వర్గాల్లో ఉన్న సమస్యలను, వారిపై సమాజంలో ఉన్న చిన్నచూపును ఆయన ప్రత్యక్షంగా చూ శారు. వెలివాడల వెతలను స్వయంగా అనుభవించారు. అందుకే పేదలకు హక్కులు కల్పిస్తూ బలమై న రాజ్యాంగాన్ని తయారుచేశారు. ఆయన రాజ్యాం గంలో పౌరులకు కల్పించిన హక్కుల వల్లే ఈనాడు మనం ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం.
ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగానైతే పట్టుబట్టి పేదల అభ్యున్నతికి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం కల్పించారో.. మన రాష్ట్ర ముఖ్యమం త్రి కేసీఆర్ అదే విధంగా పట్టుబట్టి తెలంగాణ సాధించారు. నేడు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు.. పెట్టుబడులు కాదు.. సబ్బండ వర్గాలు సుఖ సంతోషాల తో ఉన్నప్పుడే అది అభివృద్ధి. ఈ మాటలను కేసీఆర్ అక్షరాల పాటిస్తున్నారు. కుల,మత,వర్గ, విభేదాలు లేకుండా అందరి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతుల నుంచి పారిశ్రామికవేత్తల దాకా.. అందరినీ సమదృష్టితో చూస్తున్నారు. సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా సమాజంలో అణచివేతకు గురవుతున్న పేద దళిత వర్గాల బాగుకో సం, వారి కాళ్లపై వారు నిలబడేలా సంక్షేమ పథకాలను రూపొందించారు.
75 ఏండ్ల స్వతంత్ర సంబురాలు జరుపుకున్న మనం.. కొన్ని రాష్ర్టాల్లో ఇప్పటికీ కులం పేరుతో, మతం పేరుతో జరుగుతున్న దాడులను, హింసను చూస్తూనే ఉన్నాం. నిమ్న కులాలుగా పిలువబడుతున్న కొన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. పేదలు పేదల్లాగానే ఉండిపోతున్నారు. కానీ స్వతంత్ర భారతం కోరుకున్నది ఇది కాదు. సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందాలి. అప్పుడే మనం సాధించిన స్వాతంత్య్రానికి ఓ సార్ధకత ఉంటుంది. అందుకే అంబేద్కర్ స్పూర్తితో మన రాష్ర్టాన్ని ఆ బాటలో పయనింపజేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
మనదేశం చాలా విశాలమైనది. ఇక్కడ ప్రకృతివనరులు,మానవ వనరులకు కొదువలేదు. కానీ వాటిని ప్రజలందరికీ సమానంగా అందించగల సత్తా ఉన్న నాయకుడు.. సరైన ముందుచూపు ఉన్న నాయకులు లేకపోవడంతో ఏడున్నర దశాబ్దాలుగా దేశం పరిస్థితి మారడం లేదు. భావి భారత నిర్మాణం కోసం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సైతం అమలు చేయకుండా కొందరు అవినీతి, మతపిచ్చి నాయకులు అడ్డు తగులుతున్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాక… పరిపాలన అంటే ఇలా ఉండాలి అనేలా పొరుగు రాష్ర్టాలకు మాడల్గా మారింది. పబ్లిసిటీ కోసం ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ నినాదాన్ని వాడుకోవడం కాదు.. డాక్ట ర్ అంబేద్కర్ బాటలో అసలు సిసలైన ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’.. తెలంగాణలో కొనసాగుతోంది. సమాజం ఎలా ఉండాలని అంబేద్కర్ ఆనాడు ఆకాంక్షించారో తెలంగాణ అదే మార్గంలో వెళుతున్నది.
కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమానికి రూ.36,750 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.15,233 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.2,200 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయించి తన పెద్ద మనసు చాటుకున్నారు. అంతేకాదు.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు సరైన గౌరవాన్నిచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణనే.
దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ఆనాడు అంబేద్కర్ స్వప్నించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అది కండ్లముందు సాక్షాత్కరిస్తోంది. సామాజిక వెనుకబాటును పారదోలి వారికి ఆర్థిక సాంత్వన కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని దళితబంధు అనే పథకానికి రూపకల్పన చేశారు సీఎం కేసీఆర్. ఎంతో మేధో సంపత్తి ఉన్నా, ఆర్థికంగా తోడ్పాటు లేక పేదరికంలో మగ్గిపోతున్న దళిత కుటుంబాలకు ఇదొక వేగుచుక్కలా మారింది. ఒక వ్యక్తికి 10 లక్షల రూపాయల దళితబంధు అందితే.. దాని ఫలాలు అతనొక్కడే అనుభవించడం లేదు. తన చుట్టూ ఉన్న మరో నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం అనేక దళిత కుటుంబాలు సమాజానికి రోల్ మాడల్ గా నిలుస్తున్నాయి. ఇదొక్కటే కాదు వైన్ షాపుల టెండర్లలో రిజర్వేషన్లు, మెడికల్ షాపుల్లో రిజర్వేషన్లు వర్తింప జేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఏ మాట చెప్పినా అది చేతల్లో చూపిస్తున్నది. అందుకే ప్రజలు కేసీఆర్ను తమ గుండెల్లో పెట్టుకున్నారు.
చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్క ర్ రాజ్యాంగంలో చెప్పారు. ఆ నిబంధనలకు అనుగుణంగానే మన రాష్ట్రం ఏర్పడింది. అలాంటి వ్యక్తికి ఏమిచ్చినా తక్కువే. అలాంటి గొప్ప వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల చేస్తున్న చిరు సత్కారమే 125 అడుగుల విగ్రహం. అంబేద్కర్ అం టే వెలివాడల వ్యక్తికాదు.. వాడవాడలా వెలుగులు నింపిన వ్యక్తి. అందుకే రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ప్రపంచమే ఆశ్చర్యపోయే లా బాబా సాహెబ్ విగ్రహాన్ని ఏర్పా టు చేసుకున్నాం. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నాం. అలా ఆ మహనీయుడిని స్మరించుకునే అవకాశాన్ని కల్పించారు కేసీఆర్.
వై సతీష్రెడ్డి: 96414 66666
(వ్యాసకర్త : రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్)