యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో స్వయంభువుల దర్శనాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం ఉదయం మిథునాలగ్న సుముహూర్తాన ఉదయం 11.55 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ గావించి మహాఆలయాన్ని ప్రారంభించనున్నారు. భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకనుగుణంగా వసతులను కల్పించారు. కొండపై స్వామివారి దర్శనం, ప్రసాదం మాత్రమే లభించనున్నాయి. తలనీలాలు సమర్పించు కునేందుకు కల్యాణకట్ట, పవిత్ర స్నానమాచరించేందుకు లక్ష్మీపుష్కరిణి, దీక్ష చేపట్టే భక్తులకు ప్రత్యేకంగా మండపాన్ని కొండ కింద విశాల వాతావారణంలో నిర్మించారు. అన్నదాన భవనం ప్రాంతంలో ఆర్టీసీ బస్ టెర్మినల్ పనులు సాగుతున్నాయి. సకల వసతులతో సత్యనారాయణ వ్రతమండపం నిర్మాణంలో ఉన్నది. యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు గండి చెరువు పరిసర ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం జలాలు గండిచెరువులోకి చేరాయి.
– యాదాద్రి, మార్చి 26
భక్తులు పవిత్ర స్నానమాచరించేందుకు గండిచెరువు వద్ద అధునాతన లక్ష్మీపుష్కరిణి నిర్మాణం పూర్తయ్యింది. రూ. 11.55 కోట్లతో నిర్మించిన పుష్కరిణిలో ఏకకాలంలో 1,500 మంది భక్తులు స్నానం చేసే వీలుంది. మొత్తం 2.47 ఎకరాలలో పుష్కరిణి, 59 మీటర్ల వెడల్పు, 66 మీటర్ల పొడవుతో పుష్కరిణీ భవనం నిర్మించారు. 43 మీటర్ల పొడవు, 16.50 మీటర్ల వెడల్పు, 4 ఫీట్ల ఎత్తులో గుండం నిర్మించారు. ఇందులో 15 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేస్తారు.
కొండకింద ఎగ్జిట్ ఫ్లై ఓవర్ వద్ద 2.55ఎకరాల స్థలంలో రూ.15 కోట్ల వ్యయంతో నూతన నిత్యాన్నదాన సత్రభవనం పనులు కొనసాగుతున్నాయి. జీ ఫ్లస్ వన్ భవనంలో రెండు హాళ్లు, ఒక్కో హాల్లో 360 మంది చొప్పున ఏక కాలంలో 720 మంది భక్తులు భోజనం చేసే వీలుంది. భవన నిర్మాణ బాధ్యతలు వేగేష్నా ఫౌండేషన్ తీసుకుంది.
లక్ష్మీపుష్కరిణి పక్కన, నిత్యన్నదాన భవనం ముందుభాగంలో 5 ఎకరాల్లో రూ. 6.90 కోట్ల అంచనా వ్యయంతో బస్ టెర్మినల్ నిర్మిస్తున్నారు. 44 పిల్లర్లతో 8,800 ఎస్ఎఫ్టీ ఏరియాలో బస్టాండు, క్లాక్ రూం, క్యాంటీన్, మూత్ర శాలలు, స్నానాల గదులు నిర్మిస్తున్నారు. బస్టాండులోనూ 5 దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10 ప్లాట్ఫామ్స్, ఎప్పటికప్పుడు బస్సు సర్వీసులను పర్యవేక్షించేందుకు మేనేజర్కు ప్రత్యేక గదిని నిర్మిస్తున్నారు.
రాష్ట్రపతి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రముఖుల విడిది క ఓసం కొండ దిగువన ఉత్తర దిశలో 13.26 ఎకరాల గుట్టపై ప్రెసిడెన్షియల్ సూట్తో పాటు 14 విల్లాలు నిర్మించారు. దాతల సహకారం రూ. 143.08 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తికాగా ఫిబ్రవరి 12న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మహాకుంభ సంప్రోక్షణ నేపథ్యంలో వీవీఐపీల విడిది కోసం ప్రెసిడెన్షియల్ సూట్ను ముస్తాబు చేశారు.
భక్తులు కొండపైకి వెళ్లి, తిరిగి వచ్చేందుకు వీలుగా రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. దాదాపు రూ.63 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొండపైకి వెళ్లేందుకు ఆర్యవైశ్య సత్రం నుంచి 12 మీటర్ల వెడల్పు, 445 మీటర్ల పొడవుతో మొదటి ఘాట్రోడ్డును నిత్యన్నదాన భవనం వరకు ఫ్లై ఓవర్ను అనుసంధానం చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ 7 ఫిల్లర్లతో నిర్మిస్తుండగా కేబుల్ బ్రిడ్జీని బిగించనున్నారు. దర్శనం అనంతరం తిరిగి కొండ కిందకు వెళ్లేందుకు ఉత్తరదిశలో 12 మీటర్ల వెడల్పు, 683 మీటర్ల పొడవు, 17 ఫిల్లర్లతో మరో ఫ్లైఓవర్ నిర్మించారు.
స్వామివారి కొండ పక్కనే ఉన్న పెద్దగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దారు. 800 ఎకరాల్లో టెంపుల్ సిటీ పనులు ప్రారంభం కాగా 250 ఎకరాలు అభివృద్ధి చేశారు. సుమారు 5 లక్షలకుపైగా 60 రకాల వివిధ పూలు, పండ్లు, ఔషధ మొక్కలు నాటారు. రోడ్డుకు ఇరువైపులా, ప్రధాన కూడళ్ల వద్ద గార్డెనింగ్ నిర్మించారు. రోడ్డు ప్రధాన కూడలిలో వాటర్ ఫౌంటెయిన్ నిర్మించారు. టెంపుల్ సిటీకి వెళ్లేందుకు నలువైపులా ఘాట్ రోడ్లను నిర్మించారు. విశాలమైన రోడ్లు, పచ్చదనం ఉట్టిపడేలా పార్కులు అభివృద్ధి చేశారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాలు, 580 డోనర్ కాటేజీలు, షాపింగ్ కాంప్లెక్స్లు, కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్, దవాఖాన, పోచంపల్లి చేనేత వస్త్ర విక్రయాలు, వివిధ ప్రాంతాల ప్రత్యేకంగా తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు ప్రత్యేక కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నారు.
తలనీలాలు సమర్పించుకునే భక్తుల సౌకర్యార్థం లక్ష్మీపుష్కరిణి దిగువన 2.33 ఎకరాల స్థలంలో రూ. 20.25 కోట్ల వ్యయంతో కల్యాణకట్టను నిర్మించారు. ఒక్కేసారి 360 మందికి కూర్చునే విధంగా హాళ్లు, 20 స్నానాల గదులు, వేడి నీటి సదుపాయం, దుస్తులు మార్చుకునేందుకు గదులను నిర్మిస్తున్నారు. కంప్యూటరైజ్డ్ టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు.
స్వామివారి మాలధారణ గావించే భక్తులకు ప్రత్యేకమైన మండపం గండిచెరువు కొండకింద సిద్ధంగా ఉన్నది. 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా రెండు హాళ్లను నిర్మించారు. వీటితో పాటు మెడిటేషన్ హాల్ను కూడా ప్రత్యేకంగా నిర్మించారు.
యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఆధ్యాత్మికతోపాటు మానసికోల్లాసం కలిగించేలా గండి చెరువు పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పరిసరాలను పూర్తిగా పచ్చదనంతో నింపనున్నారు. ఇందుకోసం రూ. 33.69 కోట్లు కేటాయించగా రూ.20.10 కోట్లతో గండిచెరువు పూడికతీత, రక్షణగోడ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సహజ సిద్ధమైన చెట్ల పందిళ్లు, బల్లలు, పాత్వే, సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. చెరువుచుట్టూ నడకదారి నిర్మించారు. గండి చెరువును చేరుకునేందుకు లింక్రోడ్ల నిర్మాణం పూర్తికాగా, మిగతా రూ.13.59 కోట్లతో లాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూల మొక్కలు, దేవతావృక్షాలు, ఔషధ మొక్కలను నాటే పనులు సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు లేజర్షోలను తలపించే విధంగా ఫౌంటెయిట్లు నిర్మించనున్నారు. భక్తిభావం పెంపొందించే సదస్సుల నిర్వహణకు విశాలమైన హాళ్లను నిర్మించనున్నారు. గండిచెరువులో బోటు షికారు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నృసింహస్వామి జలాశయం నుంచి చేరుకున్న గోదావరి జలాలతో గండిచెరువు కళకళలాడుతున్నది.