జమ్ము: పలు అంశాలపై ప్రజల మధ్య కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు విభజన తీసుకొచ్చాయని జీ23 నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. 1991లో కశ్మీరీ పండిట్లపై దాడులకు పాకిస్థాన్, ఉగ్రవాదమే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆదివారం జమ్ములో ఓ కార్యక్రమంలో ఆజాద్ మాట్లాడుతూ మతం, కులం తదితర అంశాల ఆధారంగా తమ పార్టీ సహా పలు పార్టీలు ప్రజల మధ్య విబేధాలు సృష్టించాయని, పౌర సమాజం కలసికట్టుగా ఉండాలని చెప్పారు. తాను ఏ పార్టీనీ క్షమించట్లేదని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్లో 1991లో జరిగిన సంఘటనలతో హిందువులు, కశ్మీరీ పండిట్లు, ముస్లింలు, డోగ్రాలు నష్టపోయారని తెలిపారు.
రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ఆజాద్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పొలిటికల్ రిటైర్మెంట్’పై హింట్ ఇచ్చేలా మాట్లాడుతూ ‘రాజకీయాల నుంచి తప్పుకొని, సామాజిక సేవలో నిమగ్నమవ్వడం అంత కష్టమేమీ కాదని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసిన తర్వాత ఆజాద్ నుంచి ఈ మాటలు రావడం గమనార్హం.