లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమిలోకి అంబేద్కర్వాదులను ఆహ్వానిస్తూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌధరితో కలిసి అఖిలేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ప్రమాదంలో పడిన రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అంబేద్కర్వాదులు, సమాజ్వాదీలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్పీ, బీఎస్పీ ఏకమైతే యాదవ్-దళిత్ కలయిక యూపీలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని పాలక బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో దీటైన పోటీ ఎదురవనుండటంతో బీఎస్పీ అధినేత్రిని కలిసిరావాలని అఖిలేష్ బహిరంగంగా ఆహ్వానించారు.
యాదవులు, ముస్లింల్లో ఆదరణ కలిగిన ఎస్పీకి దళిత ఓటర్లపై పట్టున్న మాయావతి తోడైతే కాషాయ పార్టీని సులువుగా నియంత్రించవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమిలో ఇప్పటికే సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ వంటి పలు చిన్న పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 80 లోక్సభ స్ధానాల్లో చెరి సగం స్ధానాలు పంచుకునేలా ఎస్పీ-బీఎస్పీ జట్టుకట్టాయి. ఆ ఎన్నికల్లో ఫలితాలు ప్రకటించిన రెండు వారాల్లోపే మాయావతి కూటమి నుంచి తప్పుకున్నారు.
ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఎస్పీ ప్రధాన పోటీదారుగా తెరపైకి వచ్చిన క్రమంలో తిరిగి మాయావతి మద్దతుపై చర్చ ఊపందుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం నిలుపుకునేందుకు యోగి సర్కార్ సర్వశక్తులు ఒడ్డుతుండగా ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక మాయావతి సత్తా చాటేందుకు సన్నద్ధమవుతుండగా, ప్రియాంక గాంధీ ఇమేజ్తో ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ తనదైన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.