Air Pollution | దేశ రాజధాని వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నవంబర్ ప్రారంభం నుంచి రోజు రోజుకు పరిస్థితి దిగజారుతున్నది. రాబోయే దీపావళి పండగకు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వాయు కాలుష్యం పెరుగుతుండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలామంది శ్వాసకోశ, దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో మరిన్ని సమస్యలను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో ఆదివారం గాలి నాణ్యత సూచి దాదాపు 480కి పెరిగింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటర్ రీజియన్లో ఎక్యూఐ దాదాపు 500 కంటే ఎక్కువగానే ఉన్నది. దీపావళి పండుగకు ముందే ప్రజలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాయు కాలుష్యం పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు కాలుష్యం పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం ఆంక్షలు అమలులోకి తీసుకువస్తున్నది. రాబోయే 15-20 రోజులు ఛాలెంజింగ్ పరిస్థితులుంటాయి.. దాంతో
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
దేశ రాజధానిలో వాయు కాలుష్యం నిరంతరం పెరుగుతున్నది. కాలుష్యం నేపథ్యంలో నవంబర్పదో తరగతి వరకు పాఠశాలలను మూసివేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. 6-12 తరగతులకు ఆన్లైన్ ద్వారా పాఠాలో బోధించేందుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. కాలుష్యం తారాస్థాయికి చేరుకోవడంతో శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజధాని పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అధ్వాన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ ముందు జాగ్రత్తగా మినీ లాక్డౌన్ను అనుసరించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఎన్ఆర్ సహాయ్ మాట్లాడుతూ కాలుష్యం అందరికీ ప్రమాదకరమేనన్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకపోయినా కాలుష్యం నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. వాయు కాలుష్యంతో చాలా మందిలో శ్వాసకోశ సమస్యల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి వారే మినీ లాక్డౌన్ను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం పగటిపూట ఇంట్లోనే ఉండాలని.. కాలుష్య కారకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు తలుపులు, కిటికీలు మూసివేయాలని సూచించారు. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లయితే.. మాస్క్ను తప్పకుండా ధరించాలని సూచించారు.
అన్ని వయసుల వారిలోనూ కాలుష్యం ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని డాక్టర్ సహాయ్ పేర్కొన్నారు. పెరుగుతు కాలుష్యం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై సైతం ప్రభావం చూపుతుందని, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. గర్భిణి శ్వాస ద్వారా టాక్సిన్స్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయని.. అవి రక్తం ద్వారా ప్లాసెంటా, పిండంలోకి చేరుతాయన్నారు. దాంతో పిల్ల అభివృద్ధిని ప్రభావితం చేయడంతో పాటు వారిలో అనేక రకాల పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు.
గాలి నాణ్యత సూచీ 450-500 ఉన్న సమయంలో గాలిని పీల్చడం ద్వారా శరీరానికి 25 నుంచి 30 సిగరెట్లు తాగినంత హాని జరుగుతుందని.. తద్వారా శ్వాస సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వాయు కాలుష్యంతో తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, ఉబ్బసం, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలకు కారణమవుతుందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఓపీడీలో శ్వాసకోశ సమస్యలతో పిల్లలు బాధపడుతున్న కేసులు పెరిగాయి. కాలుష్యం దీర్ఘకాలిక వ్యాధులకు కాలుష్యం కారణమవుతుందని, తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు కాలుష్యం బారినపడకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.