న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో దేశంలో 20లక్షలకుపైగా నమూనాలను మంగళవారం పరీక్షించినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. త్వరలోనే రోజు 25లక్షలు టెస్టులు చేస్తామని చెప్పారు. బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి సఫ్దర్జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే, వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు లేకపోవడంతో కొత్త కేసుల్లో తగ్గుదల నమోదవుతుందని నిపుణులు హెచ్చరించారు.
ఈ క్రమంలో రోజువారీ పరీక్షలు పెంచనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గతేడాదిలో కరోనా దేశంలో పట్టణాల్లో ఎక్కువగా.. వ్యాప్తి చెందగా రెండోవేవ్లో భారీగా సోకుతోంది. గడిచిన వారం రోజులుగా దేశంలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. బుధవారం కొత్త కేసులు 2,67,334 కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడో రోజు మూడు లక్షల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 4,529 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. నిన్న ఒకే రోజు 20,08,296 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా 32,03,01,177 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.