భీంపూర్, ఏప్రిల్ 26 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల సరిహద్దు గ్రామాలు, పెన్గంగ పరీవాహక గుబ్డి, కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్ ఆదిలాబాద్ నుంచి 55 కిలోమీటర్లు.. భీంపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ మారుమూల గిరిగ్రామాల వారు.. కరంజి(టీ) తర్వాత వాగుపై బ్రిడ్జి లేక దశాబ్దాలుగా కష్టాలు అనుభవించారు. వానకాలం దాదాపుగా బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోయేవి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి, కరంజి(టీ)-గుబ్డి రోడ్డుపై ప్రభుత్వం దృష్టి సారించింది. రోడ్డు పీఆర్ నుంచి ఆర్అండ్బీకి బదలాయింపు క్రమంలో సాంకేతికంగా జాప్యం జరిగింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, స్థానిక ప్రజాప్రతినిధులు శ్రద్ధ్దతో ఇప్పుడు రూ.2.40 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం తుది దశలో ఉన్నది. అలాగే రూ.6 కోట్లతో కరంజి(బీ) – గుబ్డి 8 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు టెండర్ తర్వాత మొదలు కానున్నాయి. ఈ వర్షాకాలం లోపు ఈ బ్రిడ్జి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక సరిహద్దు గ్రామాలకే కాదు గుబ్డి సమీపం లో ఉన్న మహారాష్ట్ర పిప్పర్షెండే గ్రామానికి ఈ బ్రిడ్జితో రోడ్డు రవాణా సౌలభ్యం కానున్నది. దీంతో వారు హర్షం వ్యక్తం జేస్తున్నారు.
కరంజి(టి) – టేకిడిరాంపూర్ నడుమ ఉన్న ఈ వాగుతో వర్షాకాలంలో పది గ్రామాలకు సంబంధాలు ఉండవు. అక్కడి గ్రామాల్లో ఉన్న వ్యవసాయ కూలీలు ఇక్కడి గ్రామాలకు రాలేని పరిస్థితి ఉండేది. అలాగే వాగు దాటి ఉన్న పంట పొలాల రైతులు ఇబ్బందులు పడేవారు. వర్షా కాలంలో ఈ వాగు వరదతో టేకిడి రాంపూర్ వైపు ఒడ్డున ఆగిన వారు, ఇక్కడ కరంజి(బీ) వైపు చిక్కుకున్నవారు వెనుతిరిగి ఆ గ్రామాలకు వెళ్లి ఆశ్రయం పొందాల్సి వచ్చేది. ఇప్పుడా కష్టాలు తప్పనున్నాయ్.
ఎన్నో ఏళ్ల కల నెరవేరుతున్నది.. మా తాతల కాలం నుంచి మా గుబ్డికి రోడ్డు, పూలుగు( బ్రిడ్జి) లేక అరిగోస పడుతున్నం. ఇగ నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మేము ఎడ్లాపురం లేకుంటే భీంపురం మండలం పోవాలే అంటే ముందు 8 కిలోమీటర్లు నడిచి కరంజికి పోవడుతుండే. తెలంగాణ సర్కారు అచ్చినంక సౌలతులు అయినయ్. వాగు మీద పెద్ద బ్రిడ్జి అవుతున్నది. మేము సీఎం కేసీఆర్ సార్, ఎమ్మెల్యేకు రుణపడి ఉంటం.
-బొలిపెల్లి రాజుయాదవ్, రైతు, గుబ్డి