KCR | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినవన్నీ భూటకపు హామీలు అని.. అరచేతిలో వైకుంఠం చూపించారని తెలంగాణ రైతాంగం బాధపడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ పట్టణంలో పర్యటించిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో మోసం చేసిందని మండిపడ్డారు. రైతుబంధు కింద రూ.15వేలు ఇస్తామని చెప్పారని.. ఇవ్వకుండా దోఖా చేశారని.. మేం రెండు వేల పింఛన్ ఇస్తే 4 వేలు ఇస్తామని చెప్పి దోఖా చేసిండ్రు అని మండిపడ్డారు. మేం ఇచ్చిన వాటికి డబుల్, త్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు.. ఎవరికైనా ఇచ్చిండ్రా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో మహిళలకు ఫ్రీ బస్సు మాత్రం నెరవేర్చారని కేసీఆర్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే.. ఆ బస్సుల్లో సర్కస్లో జరిగినట్లు కొట్లాటలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మహిళలు జుట్లు పట్టుకుని కొట్లాడుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఉచిత బస్సు పథకం మాకెందుకు అని మహిళలే నిలదీస్తున్నారని తెలిపారు. ఈ స్కీమ్తో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని అన్నారు.
గోదావరి నిండా బ్యారేజిలు కట్టి అమృతధారల్లాంటి నాలుగు జలధారలను ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించామని కేసీఆర్ తెలిపారు. కానీ అవన్నీ ఇవాళ మాయమైనయని అన్నారు. మళ్లీ ఊళ్లళ్లకు బోరుబండ్లు వస్తున్నాయని.. పూడికలు తీసే క్రేన్లు వస్తున్నాయని.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చినయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం ఉన్న కరెంటు ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. రెప్పపాటు కూడా పోకుండా తొమ్మిదేండ్లు కరెంటు ఇచ్చామని.. ఇప్పుడు ఎటు పోయిందని నిలదీశారు. మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడికి పోయినయని ప్రశ్నించారు. మళ్లీ బిందెలు పట్టుకుని పోవడం, ట్యాంకర్లు రావడం, చూస్తుంటే నాకే కండ్లళ్లకు నీళ్లు వస్తున్నాయి.. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ కలగుతుందని భావోద్వేగానికి గురయ్యారు. కరెంటు ఎక్కడికిపోయింది.. మంచినీళ్లు ఎక్కడికి పోయినయ్.. ఇదేం దుస్థితి. ఏం దౌర్భాగ్యం.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగైదు నెలల్లోనే ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నామనేది ఆలోచించాలని ప్రజలకు సూచించారు.
రైతుబంధు కింద 15వేలు ఇస్తామని నమ్మబలికి.. ఉన్న 10 వేలు ఇవ్వకుండా దాన్ని కూడా కింద మీద చేసి పరిస్థితి చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కల్యాణ లక్ష్మీ వస్తుంది తప్ప.. కొత్త చెక్కులు ఇవ్వడం లేదన్నారు. ‘మునుపు గరీబోళ్లకు రోగమో, నొప్పి వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేవి. ఇవాళ ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కు కూడా ఇస్తలేరు. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం ఇస్తామని చెప్పిండ్రు.. సన్న బియ్యం ఇవ్వట్లేదు. ఏ ఒక్క వాగ్ధానం కూడా కాలేదు. అయ్యే పరిస్థితి కూడా లేదు.’ అని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటదో.. ఊడుతదో.. ఏం జరుగుతదో తెలియదని అన్నారు.