న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడంతో పాటు ఖర్చులు తగ్గించుకునే పనిలో టెక్ కంపెనీలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్నాయి. మెటా, ట్విట్టర్, అమెజాన్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా తాజాగా అడోబ్లోనూ కొలువుల కోత కలకలం రేపుతోంది.
అడోబ్ ఇప్పటికే సేల్స్ టీమ్కు చెందిన 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రస్తుతం 28,700 మంది ఉద్యోగులు అడోబ్లో పనిచేస్తుండగా రాబోయే రోజుల్లో ఉద్యోగ భద్రతపై సిబ్బందిలో గుబులు మొదలైంది. ఇక అడోబ్తో పాటు బైజూస్, జోష్, హెల్తిఫైమి వంటి దేశీ టెక్ కంపెనీలు సైతం గత కొద్ది వారాలుగా పలువురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి.
తొలగించిన ఉద్యోగులకు కంపెనీలోని ఇతర పొజిషన్లలో అవకాశాలు కల్పించేందుకు అడోబ్ యోచిస్తోంది. కీలక విధులను నిర్వహించే విభాగాలకు ఉద్యోగులను బదలాయించామని అడోబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తాము ఎక్కడా కంపెనీ వ్యాప్తంగా లేఆఫ్స్ ప్రకటించలేదని, కీలక పోస్టుల్లో నియామకాలూ చేపడుతున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.