తలమడుగు, జూలై 1 : పామాయిల్ సాగుకు అవసరమైన మెళకువలు, శిక్షణ పొంది రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని మదన్పూర్ గ్రామంలో ఉన్న పామాయిల్ నర్సరీని శుక్రవారం సందర్శించారు. పామాయిల్ మొక్కలు నాటే విధానాన్ని రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవనశాఖ అధికారులతో పాటు సంబంధిత ఏజెన్సీల సిబ్బందికి సూచించారు. పామాయిల్ సాగు చేసేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
మొదటి విడుత జూలైలో 1,368 ఎకరాల్లో 68,400 మొక్కలు, నవంబర్, డిసెబంర్ నెలల్లో 2,508 ఎకరాల్లో లక్షా 25వేల 400 మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. రైతులు పామాయిల్ పంటను అధికారుల సూచనల మేరకు సాగు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో 3,876 ఎకరాలకు గాను లక్షా 93 వేల 800 మొక్కలు ఈ ఆర్థిక సంవత్సరానికి నర్సరీల్లో పెంచుతున్నామన్నారు. యాగాంబి ఎంఎల్ 161 రకం గల మొక్కలు పెంచుతున్నామని, కొమ్మలు తక్కువగా ఉండడం, గాలులకు తట్టుకునేలా పొట్టిరకం, సంవత్సర పొడువుగా కాత కాయడం ఈ రకం ప్రత్యేకత అన్నారు. అనంతరం నర్సరీలో కలెక్టర్ పామాయిల్ మొక్క నాటారు. సర్పంచ్ భగీర్తబాయి, తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.