మంచిర్యాల, జూలై 1(నమస్తే తెలంగాణ): వానకాలం ప్రారంభమైందంటే వర్షాలు, ఈదురు గాలులకు ఎక్కువగా విద్యుత్ తీగలు పడిపోతుంటాయి. విద్యుత్ సరఫరా అవుతున్న విషయం తెలియక తీగలను, స్తంభాలను పట్టుకొని మూగ జీవాలతో పాటు ప్రజలూ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం. పలు సందర్భాల్లో కిందికి వేలాడుతున్న తీగలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నా అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
వానకాలంలో ఈదురుగాలులతో విద్యుత్ తీగలు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోయి కరెంటు సరఫరరా అవుతుండడంతో పశువులు, ప్రజలు షాక్తో మృతి చెందుతున్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లినప్పుడు అక్కడ సరైన వైరింగ్ లేక ఏమరుపాటుతో ప్రమాదాల బారిన పడుతున్నారు. డిస్ట్రిబ్యూషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనుమతి లేకుండా ఫ్యూజులు మార్చే సందర్భంలో కరెంటు సరఫరా కావడంతో పలువురు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. సర్వీస్ వైర్లు, వీధి దీపాలను సరిచేసేందుకు విద్యుత్ స్తంభాలు ఎక్కినప్పుడు కరెంటు సరఫరా జరిగి మృతి చెందిన సందర్భాలూ ఉన్నాయి.
వానకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ వైర్లు తెగిపడినా, నేలవాలినా ఎలాంటి రిపేర్లు చేయరాదు. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారాన్ని ఇవ్వాలి. లేదంటే విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలి. వ్యవసాయ బోర్లకు ఏదైనా పాత సర్వీస్ వైర్లు ఉంటే వాటిని మార్చుకోవాలి. రైతులు మోటర్ల వద్దకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. పొలాల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
– ఈ.రవికుమార్, ఏడీఈ, చెన్నూర్ ఆపరేషన్, మంచిర్యాల జిల్లా