కారేపల్లి (ఖమ్మం), డిసెంబర్ 15 : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మూడో విడుత పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, మద్యం, డబ్బులు, కానుకల పంపిణీపై ప్రత్యేక బృందాలు దృష్టి సారించాయన్నారు. పౌరులు నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎన్నికలకు ఎక్కడైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలింగ్ మొదలు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేంత వరకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలిపారు. ఆరు మండలాలకు 8 మంది ఏసీపీలు, 20 మంది సిఐలు, 87 మంది ఎస్ఐలు, 17 వందల మంది సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పహారా, నిఘా బృందాలు, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 78 రూట్ మొబైల్ పార్టీలు, 15 ఎఫ్ఎస్టీ బృందాలు, 30 ఎస్ఎస్టీ బృందాలతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ బృందాలతో పికెటింగ్ నిర్వహించి అప్రమత్తంగా. ఉన్నామని, ఎక్కడా గొడవలు జరగకుండా పోలీస్ బృందాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు, సమస్యలను సృష్టించే వారిని ముందస్తు బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉండాలని అన్నారు. సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని, విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.