హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్లకు ఆదివారం వెబ్ కౌన్సెలింగ్ జరుగనున్నది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అదనపు మాప్ అప్ నోటిఫికేషన్ను శనివారం విడుదల చేసింది. యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తి కాగా.. మాప్ అప్ విడత కౌన్సెలింగ్ తర్వాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
ఆదివారం ఉదయం 6 సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్కు అర్హులని అధికారులు పేర్కొన్నారు. గత కౌన్సెలింగ్లో సీట్ పొంది కూడా చేరని, చేరినా మధ్యలో కోర్సు వదిలేసిన, ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన వారు అనర్హులని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ https://knruhs.telangana.gov.inలో సంప్రదించాలని సూచించారు.