హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నీ ఒకే రంగులో దర్శనమివ్వనున్నాయి. ఎక్కడికెళ్లినా పాఠశాలను సులభంగా గుర్తుపట్టేలా కామన్ కలర్కోడ్ అమలుచేయనున్నారు. బడిగోడను స్వీయ అభ్యసన బోర్డులుగా తీర్చిదిద్దనున్నారు. అందమైన చిత్తరులు, ఆకట్టుకొనే కళాఖండాలతో అందంగా ముస్తాబు చేయనున్నారు. బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్ (బాల) కాన్సెప్ట్తో స్కూళ్లకు సర్వాంగసుందరంగా రంగులు అద్దనున్నారు. ఇదంతా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకంలో భాగంగా చేపట్టనున్న పెయింటింగ్ విశేషాలు. ఫ్లోర్ మొదలుకొని గోడలు, కిటికీలు, తలుపులు, పైకప్పు, ఫర్నీచర్, కారిడార్లు, ప్రహరీలు, మెట్లు, ప్లాట్ఫాం, ఆటస్థలాన్నింటినీ కళాఖండాలతో నింపేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన అదనపు మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఇటీవల విడుదలచేశారు. వాటిని జిల్లా కలెక్టర్లకు పంపించిన ఆమె.. అమలయ్యేలా చూడాలని ఆదేశించారు.
అదనపు మార్గదర్శకాలు..
ఈ పథకానికి ఎంపికైన పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు 27లోగా శిక్షణ ఇవ్వాలి.
వర్క్ ఏజెన్సీలు స్కూళ్లను దర్శించి అవసరాలను గుర్తించి బడ్జెట్ అంచనాలు రూపొందించాలి.
తొలివిడతలో ఎంపికైన బడులను కలెక్టర్, అదనపు కలెక్టర్ విభజించుకొని తనిఖీలుచేయాలి. ప రిపాలన అనుమతులు ఇచ్చే ముందే వర్క్ ఏజెన్సీ అంచనాలు సక్రమమో కాదో పరిశీలించాలి.
జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రితో కూడా ఆయా పనులకు ఆమోదం తీసుకోవాలి.
జిల్లా కలెక్టర్లు ఈ పథకం కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక బ్యాంకు ఖాతాను తీయాలి.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు రెండు బ్యాంకు ఖాతాలను తీయాలి. రివాల్వింగ్ ఫండ్ నిర్వహణకు ఒకటి, విరాళాల నిర్వహణకు మరొకటి.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చెందిన రూ.5 కోట్ల నియోజకవర్గ నిధుల నుంచి రూ.2 కోట్లను తప్పనిసరిగా ఈ పథకం కోసం వినియోగించాలి. ఈ మేరకు ప్రణాళికాశాఖ ఆదేశాలిస్తుంది.
సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెస్సీ చేత ప్రతి బడిలో సోషల్ అడిట్ చేయిస్తారు.
ప్రహరీలు, టాయిలెట్లు, కిచెన్షెడ్లను ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపడుతారు. గ్రామీణాభివృద్ధిశాఖ, కమిషనర్ వీటికి అనుమతులిస్తారు.
ఎంఎన్ఆర్ఈజీఎస్ అమలుకాని పట్టణ ప్రాంతాల్లో ఈ మూడు పనులు చేపట్టేందుకు నిధులను రెగ్యులర్ ఫండ్స్ నుంచే కేటాయిస్తారు.
రాష్ట్రస్థాయిలో కొనే వస్తు సామగ్రి మినహా రూ.30 లక్షల అంచనాలకు ఎస్ఎంసీల చేత నామినేషన్ పద్ధతిలో, రూ.30 లక్షలకు మించిన పనులను టెండర్ల ద్వారా చేపడుతారు.
జిల్లా కలెక్టర్లు సూచించిన 12 అంశాలే కాకుండా అదనపు హంగులు సమకూర్చవచ్చు.
రాష్ట్రస్థాయిలో పనులను రెండు క్వాలిటీ కంట్రోల్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తాయి.