న్యూఢిల్లీ, నవంబర్ 20: ఎలక్టోరల్ బాండ్ల పథకానికి సవరణలు చేసిన కేంద్రం.. అసలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి సమాచారం ఇవ్వలేదా? అంటే అవుననే ఆర్టీఐ సమాధానంలో వెల్లడైంది. ఇటీవల హడావిడిగా తీసుకొచ్చిన సవరణలపై దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్రమైన చర్చ నడుస్తున్నది. రాష్ర్టాలు, అసెంబ్లీలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాధారణ ఎన్నికలు జరిగే సంవత్సరంలో బాండ్ల అమ్మకానికి అదనంగా మరో 15 రోజులు అవకాశం కల్పించడం.. అదీ సరిగ్గా హిమాచల్ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ చర్య తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఐ కింద సమాధానం కోరగా.. ఎలక్టోరల్ బాండ్ల అమ్మకానికి రోజుల పెంపుపై కేంద్రం ఆర్బీఐని సంప్రదించలేదని, ఆమోదం తీసుకోలేదని తేలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934లోని సెక్షన్ 31 ప్రకారం వచ్చిన అధికారాలను వినియోగించుకొని ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిన మోదీ సర్కార్.. ఇప్పుడు అదే ఆర్బీఐకి తెలియకుండా, చెప్పకుండా సవరణలు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు
అనామక రాజకీయ విరాళాలు పొందేందుకు అవకాశం కల్పించే వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్ స్కీమ్-2018ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వాటిపై సర్వోన్నత న్యాయస్థానం వచ్చే నెల 6న విచారణ చేపట్టనున్నది. అయితే ఇటువంటి సమయంలోనే బాండ్ల అమ్మకానికి అదనంగా మరో 15 రోజులు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై పలు వివరాలు కోరుతూ సమాచార హక్కు కార్యకర్త కమోడోర్ లోకేశ్ కే బాత్రా(రిటైర్డ్) 9న ఆర్థిక వ్యవహారాల విభాగానికి(డీఈఏ) ఆర్టీఐ దరఖాస్తు చేయగా.. ఆర్బీఐని సంప్రదించలేదని, ఎన్నికల సంఘానికి మాత్రమే సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది.