(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘ఇక్కడ డ్యామ్ కడితే.. రాష్ట్రంలోని భూములన్నీ సస్యశ్యామలం అవుతాయ్’ అని అధికారులు చెప్పగానే ఆ ఆదివాసీలు పొంగిపోయారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. తరతరాలుగా ఉంటున్న తమ నివాస, వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే, డ్యామ్ కడుతామంటూ సేకరించిన ఆదివాసీల భూముల్లో ప్రభుత్వం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. టూరిస్టులను ఆకర్షించడం కోసం ఆ భూముల్లోనే హోటళ్లు, రోడ్లను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. దీన్ని నిరసిస్తూ బాధిత ఆరు గ్రామాల ఆదివాసీలు నిరసనబాట పట్టారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో జరుగుతున్నదీ మహోద్యమం.
తిరిగి ఇవ్వాల్సిందే
సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం కోసం 1960 దశకంలో అప్పటి గుజరాత్ ప్రభుత్వం ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న కెవాడియా, వాఘదియా, లింబ్డీ, నవగమ్, గోరా, కోటీ గ్రామాల నుంచి పెద్దయెత్తున భూమిని సేకరించింది. 1987లో ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. పూర్తైన ప్రాజెక్టును 2017లో ప్రారంభించారు. అయితే, ప్రాజెక్టుకు అవసరమైన దానికంటే ఎక్కువ భూమిని సేకరించిన ప్రభుత్వం.. మిగతా స్థలంలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని 2018లో ఏర్పాటు చేసింది. టూరిస్టులను ఆకర్షించడానికి విగ్రహం సమీపంలో పెద్ద హోటళ్లు, రోడ్లు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కార్యచరణను సిద్ధం చేసింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం కోసమే ప్రభుత్వానికి తాము భూములు ఇచ్చామని ఆరు గ్రామాల్లోని బాధిత ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నారు. విగ్రహాలు, హోటళ్ల ఏర్పాటు కోసం తమ భూములను ఎలా వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు. తినడానికి తిండి కూడా లేని తమను ఆదుకోవాల్సిందిపోయి, తమ భూములను ప్రభుత్వం వేరే నిర్మాణాలకు తీసుకోవడమేంటని మండిపడుతున్నారు. తగిన పరిహారం కూడా చెల్లించలేదని ధ్వజమెత్తుతున్నారు. వెంటనే తమ భూములను వెనక్కి ఇవ్వాలని ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎన్ఎన్ఎల్)ను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఆరు నెలలుగా నిరసనలను ఉద్ధృతం చేస్తున్నారు.
మా భూమిలో ఓ హోటల్ నిర్మించారు. పరిహారం మాత్రం ఇంతవరకూ ఇవ్వలేదు. చట్టప్రకారం పోరాడుదామంటే.. భూముల డాక్యుమెంట్ల కోసం ఎక్కడికి పోగలం? సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ మాకు వినాశనాన్ని చూపించారు.
-శకుంతలబెన్,కెవాడియా గ్రామస్థురాలు
ఆదివాసీల్లోని చాలా మందికి చదువురాదు. వ్యవసాయమే వారి ప్రధాన వృత్తి. వాళ్ల భూములను లాక్కొని.. వేరే నిర్మాణాలకు వినియోగించడం తప్పు. ఇలా చేస్తే వాళ్లు ఎలా బతుకుతారు?
-రాజేంద్ర తడ్వీ, సామాజిక కార్యకర్త